బెంగళూర్లో దారుణం: బంగ్లాదేశ్ మహిళ దుస్తులు విప్పారు, దాడి
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో ఓ బంగ్లాదేశ్ మహిళ పైన దారుణానికి పాల్పడ్డారు. చెప్పులకు బిల్లు చెల్లించలేదని మహిళ పైన దాడి చేశారు. అంతేకాకుండా ఆమె దుస్తులు విప్పి దాడికి పాల్పడ్డారు. ఆమె వద్ద నుండి డబ్బులు లాక్కున్నారు. బాధితురాలి పేరు రషీదాగా తెలుస్తోంది.
ఆమె బంగ్లాదేశ్ నుండి తన భర్తకు చికిత్స కోసం బెంగళూరు వచ్చింది. ఈ దాడిలో స్థానికంగా ఉన్న ఓ రాజకీయ పార్టీ నాయకురాలు కూడా పాల్గొన్నారు. ఆమె పేరు మంజుల అని తెలుస్తోంది. ఈ దాడి ఘటనలో సెక్యురిటీ గార్డులు సహా అందర్నీ అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన హెబ్బగుడిలో జరిగింది.
ఎలక్ట్రానిక్ సిటీగా పేరు గాంచిన బెంగళూరులోని ఓ సూపర్ మార్కెట్లో శుక్రవారం నాడు ఈ ఘటన జరిగింది. ఆమె పైన దాడి చేసి, రాబరీ చేశారని సూపర్ మార్కెట్కు చెందిన ఇద్దరు సెక్యూరిటీ గార్డుల పైన కేసు నమోదు చేశారు.
దీనిపై సూపర్ మార్కెట్ యాజమాన్యం స్పందిస్తూ... ఆ మహిళ చెప్పుల జతకు బిల్లు చెల్లించలేదని, దీంతో ఆమెను అడగవలసి వచ్చిందని చెప్పారు. కాగా, ఈ దాడి ఘటనలో స్థానిక రాజకీయ నాయకురాలు పాల్గొనడం గమనార్హం.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తన వద్ద రూ.65,000 ఉండెనని బాధితురాలు పోలీసులకు చెప్పారు. ఆమె తన భర్తను నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చేర్పించాక మార్కెట్కు వెళ్లారు. అక్కడ స్లిప్పర్స్తో పాటు అవసరమైన వస్తువులు కొనేందుకు వెళ్లారు.
ఆమె బయటకు వస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది.. స్లిప్పర్స్కు డబ్బులు చెల్లించలేదని దాడికి పాల్పడ్డారు. ఆమె వాటిని దొంగిలించిందని వారు ఆరోపించారు. వారు ఆమె దుస్తులు విప్పి చూశారు. నెట్టి వేశారు. ఆమె వద్ద నుండి డబ్బులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.