అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయుల అరెస్టు: ఎలా వచ్చామో చెప్పిన వలసదారులు
బంగ్లాదేశ్ వీడి అక్రమంగా భారత్లోకి చొరబడిన వారిని గుర్తించి తిరిగి తమ దేశానికి వెళ్లాలంటూ కేంద్రప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడో బంగ్లాదేశ్ను వీడి తాము భారత్లో స్థిరపడ్డామని చెబుతున్నారు బాధితులు. వారు బంగ్లాదేశ్ నుంచి ఎలా వచ్చింది వివరించారు. మొహ్మద్ సయ్యద్ ఉల్ అనే వ్యక్తి తన భార్య అన్సాలా, ఇద్దరి పిల్లలతో కలిసి ఐదేళ్ల క్రితం బంగ్లాదేశ్ నుంచి బెంగళూరుకు వచ్చాడు. సరిహద్దులను అక్రమంగా దాటి భారత్లో అడుగుపెట్టాడు. భారత్లో అడుగు పెట్టాక బెంగళూరుకు చేరుకుని ఆ నగర శివార్లలో ఉన్న రామమూర్తినగర్లో స్థిరపడ్డారు.
60 మందిని అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు
సయ్యద్ బెంగళూరు మహానగర పాలికలో పనిచేసే కాంట్రాక్టర్ కింద పనిచేస్తుండగా.. అతని భార్య పనిమనిషిగా పలు ఇళ్లల్లో పనిచేస్తూ జీవితం సాగిస్తున్నారు. తన ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారని సయ్యద్ చెప్పాడు. తనకు ఇద్దరు కుమార్తెలని చెప్పిన సయ్యద్ తన భార్య పనిచేసే ఒక ఇంట్లో ట్యూషన్కు వెళుతున్నారని చెప్పాడు.
పోలీసులు బెంగళూరులో నివసిస్తున్న బంగ్లాదేశీయులను మొత్తం 60 మందిని గుర్తించగా అందులో ఒకరిగా ఉన్నాడు సయ్యద్. ఈ 60 మందిలో 22 మంది మహిళలను 9 మంది పిల్లలను ఒక సంరక్షణ కేంద్రంలో ఉంచారు. మరో 29 మంది పురుషులను పోలీస్ స్టేషన్లో ఒక గదిలో ఉంచారు.వీరందరినీ ఈ మధ్యే రైలులో పశ్చిమబెంగాల్కు తరలించారు.
సరిహద్దులు దాటించేందుకు సహకరించిన ఓ వ్యక్తి
ఇక వీరందరూ బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి వలస వచ్చేందుకు ఒక వ్యక్తి సహకరిస్తున్నట్లు చెప్పాడు సయ్యద్. ఏ సమయంలో సరిహద్దులను దాటాలో చెప్పడమే కాకుండా ప్రతి ఒక్కరిని దాటించడంలో సహకరించినందుకు రూ.1000 తీసుకుంటాడని సయ్యద్ చెప్పాడు. అతను సరిహద్దులో ఉన్న ఓ గ్రామంలో ఉంటాడని చెప్పాడు.
ఇక బెంగళూరులో పట్టుబడ్డ చాలా మంది బంగ్లాదేశీయులు ఖుల్నా జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన నివాసితులని పోలీసులు చెప్పారు. కోల్కతాకు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవాలంటే ఐదు గంటల సమయం పడుతుందని చెప్పారు. వీరంతా బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న బీనాపోల్ నుంచి పశ్చిమ బెంగాల్లో ఉన్న బసీర్హత్కు చేరుకుంటారని పోలీసులు వివరించారు.
ఒక్కొక్కరు ఒక్కో సమయంలో భారత్లోకి ఎంటర్
ఇక తామంతా రహస్యంగా భారత్కు చేరుకున్నామని చెప్పిన మొహ్మద్ సలాలుద్దీన్ అనే వ్యక్తి భారత్కు రాకముందు ఒకరికొకరు పరిచయం లేదని చెప్పాడు. అంతా కలిసి రామాని.. ఇద్దరు ముగ్గురుగా కలిసి వస్తామని చెప్పాడు. ఒకరు ఐదేళ్ల కిందట వస్తే మరొకరు ఒక ఏడాది కింద భారత్కు వచ్చాడని సలాలుద్దీన్ చెప్పాడు.
మరొక వ్యక్తి ఆరు నెలల క్రితమే వచ్చాడని చెప్పాడు. అయితే వీరందరికంటే ముందు వచ్చిన ఒక వ్యక్తి తమకు తెలుసని సలాలుద్దీన్ చెప్పాడు. ఇక సలాలుద్దీన్ బంధువు మొహ్మద్ హకీమ్ అనే వ్యక్తి మూడు నెలల క్రితం భారత్కు వచ్చినట్లు చెప్పాడు. తాను సరిహద్దు దాటే సమయంలో మోకాళ్ల వరకు నీళ్లు ఉండేవని చెప్పాడు హకీమ్.
బెంగళూరులో చెత్త ఏరివేసే పని చేసేవారు
ఇక తమను సరిహద్దు దాటించే వ్యక్తి నీరున్న ప్రదేశంలో కానీ లేక పొడినేల ఉన్న ప్రాంతంలో కానీ దించేసి వెళతారని హకీమ్ చెప్పాడు. తమను సరిహద్దు దగ్గర వదిలేస్తారని ఇక అక్కడి నుంచి తామే నడుచుకుంటూ వచ్చేస్తామని చెప్పాడు హకీమ్. తమను సరిహద్దు దాటించే వ్యక్తికి మాత్రమే డబ్బులు చెల్లిస్తామని మిగతాదంతా ఆ వ్యక్తే చూసుకుంటాడని వెల్లడించాడు. వీరంతా ఒక కాంట్రాక్టర్ కింద చేరి చెత్త ఏరివేసే పని చేసుకుంటూ నెలకు రూ.4వేల జీతం పొందుతున్నట్లు పోలీసులు చెప్పారు.
భారత్లో అయితే దంపతులిద్దరూ పనిచేసుకోవచ్చు
ఇక జమాల్ అనే మరో బంగ్లాదేశీయుడు వీరందరిని పనికి పెట్టుకున్నాడని అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఇక బంగ్లాదేశ్కు వెళితే రోజుకు రూ.300 సంపాదించుకుంటారని అయితే అక్కడ మహిళలు పనిచేయరని పోలీసులు చెప్పారు. బతకడం కష్టం అవుతుండటంతోనే వారు భారత్కు వచ్చి భార్య భర్తలు ఇద్దరూ పనిచేస్తూ సంపాదించుకుంటారని వెల్లడించారు.
అక్టోబర్లో పోలీసులు దాడుల గురించి తెలుసుకున్నవారు చాలామంది తాము నివసిస్తున్న ప్రదేశం నుంచి పారిపోయి ఎక్కడో ఉన్నారని చెప్పారు పోలీసులు. ఇక ఎవరినైనా ఒక పనికి కుదుర్చుకునే ముందు వారి గుర్తింపు కార్డులను పరిశీలించాకే పనిలో పెట్టుకోవాలని లేదంటే యజమానులు కూడా నేరస్తుల కింద పరిగణించబడుతారని బెంగళూరు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
భారత్లో ఉండేందుకు ప్రభుత్వం అనుమతివ్వాలి
ఇదిలా ఉంటే తమ ఇంట్లో ఓ మహిళ పనిచేసేదని తనకు అర్జెంటుగా పని ఉందని చెప్పి వెళ్లిపోయిందని వివేక్ అనే యజమాని చెప్పాడు. మిగతా వారి గురించి తనకు తెలియదని అయితే ఆ మహిళ మాత్రం చక్కగా పనిచేసుకుని వెళ్లిపోయేదని కితాబిచ్చాడు. ఇలాంటి వలసదారులు చట్టప్రకారంగా భారత్లో జీవనం సాగించేందుకు సహకరిస్తే బాగుంటుందని వివేక్ అభిప్రాయపడ్డాడు.