దేశ రాజధానిలో పట్టపగలే బ్యాంక్ దోపిడీ: క్యాషియర్ను కాల్చేసి, డబ్బు చోరీ(వీడియో)
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పట్టపగలే బ్యాంక్ దోపిడీ జరగడం సంచలనంగా మారింది. మాస్క్లతో వచ్చిన దుండగులు.. అందరూ చూస్తుండగానే ఓ బ్యాంక్ను దోపిడి చేశారు. వారిని అడ్డుకున్న క్యాషియర్ను తుపాకితో కాల్చి చంపారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ దోపిడీ చావ్లా సమీపంలోని కైరా గ్రామ కార్పొరేషన్ బ్యాంకులో శుక్రవారం చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతి చెందిన క్యాషియర్ సంతోష్కుమార్ (45) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ ఉద్యోగి అని పోలీసులు తెలిపారు. ఉద్యోగ విరమణ తర్వాత సంతోష్ కార్పోరేషన్ బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్నారని చెప్పారు. ఈ దోపిడీలో మొత్తం ఆరుగురు పాల్గొన్నారని, ముఖాలకు మాస్క్లు ధరించి, తుపాకులతో దాడి చేశారన్నారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన సంతోష్పై కాల్పులు జరిపారు.
బుల్లెట్ అతని చాతిలోకి దూసుకెళ్లిందని, తాము సంఘటనాస్థలికి వచ్చేలోపే అగంతకులు తప్పించుకున్నారని.. రక్తపుమడుగులో ఉన్న సంతోష్ను వెంటనే ఆసుపత్రికి తరలించామని చెప్పారు. కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు మీడియాకు తెలిపారు.
ఈ ఘటన జరిగిన సమయంలో బ్యాంకులో ఆరుగురు ఉద్యోగులు, 8 మంది బ్యాంకు వినియోగదారులున్నారని.. నిందితులు ఎవరిని కాల్చమని చెప్పారని, ఇంతలో సంతోష్ ప్రతిఘటించడంతో అతనిపై కాల్పులు జరిపారన్నారు.
#InVideo: CCTV footage of a corporation bank being robbed in Delhi's Khaira yesterday by armed assailants. Cashier was shot dead. Investigation underway.#Delhi
— Oneindia.com (@Oneindia) October 13, 2018
Visuals- ANI pic.twitter.com/UHRP4JggXT
కాగా, సంతోష్కు ఓ భార్య ఇద్దరు పిల్లలున్నట్లు పేర్కొన్నారు. రూ.2 లక్షలు ఎత్తికెళ్లినట్లు బ్యాంకు ఉద్యోగులు తమకు తెలిపారని, అగంతకులు చేసిన దోపిడిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామన్నారు. కాగా, ఈ దోపిడీ ఘటనంతా బ్యాంకులోని సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఈ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.