బ్యాంకుల విలీనంకు నిరసనగా బంద్కు పిలుపిచ్చిన ఉద్యోగస్తులు
న్యూఢిల్లీ: 27 ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేస్తూ 12 ప్రభుత్వ రంగం బ్యాంకులకు కుదిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగస్తులు కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శనివారం నిరనస తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో బ్యాంకింగ్ వ్యవస్థ బలహీన పడుతుందని బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ దేబాశిష్ బసు చౌదరి తెలిపారు.
ఇక ఈ నిరసనలో పలు బ్యాంకుల యూనియన్లు కూడా పాల్గొంటాయని సమాచారం. బ్యాంకుల విలీనంకు తాము వ్యతిరేకమని చెప్పారు దేబాశిష్ బసు చౌదరి. గతంలో బ్యాంకులు విలీనం అయిన సందర్భంలో చాలా బ్రాంచీలు, కార్యాలయాలు మూతపడ్డాయని గుర్తు చేశారు. ఇదిలా ఉంటే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేస్తూ శుక్రవారం సాయంత్రం కీలక ప్రకటన చేశారు. విలీనంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన బ్యాంకులు గట్టెక్కుతాయని ఆమె చెప్పారు. అంతేకాదు ఆర్థికవ్యవస్థ కూడా పుంజుకుంటుందని చెప్పారు.
బ్యాంకులు విలీనం కావడంతో అతిపెద్ద విలీనంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ యునైటెడ్ బ్యాంకులు నిలిచాయి. మూడు బ్యాంకులు విలీనం కావడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత రెండో అతిపెద్ద బ్యాంకుగా అవతరించనుంది. కొన్నేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన మాంద్యం కోరల్లో చిక్కుకోకుండా ఈ బ్యాంకులే దేశాన్ని కాపాడాయని చౌదరి తెలిపారు. ఈ నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థను బలహీనం చేయడంతో పాటు ఆర్థిక సమ్మేళనం లక్ష్యానికి విరుద్ధంగా ఉండనుంది అని ఆయన వెల్లడించారు