2రోజులు మళ్లీ బ్యాంకులు బంద్.. 8,9 తేదీల్లో సమ్మె.. 30 రోజుల్లో మూడుసార్లు..!
ఢిల్లీ : బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మె సైరన్ మోగించారు. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు మరోసారి మూతపడనున్నాయి. ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో 2 రోజులు బ్యాంకుల సేవలు నిలిచిపోనున్నాయి. ఈనెల 8, 9 తేదీల్లో సమ్మెకు పిలుపునివ్వడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించనున్నాయి. వేతన సవరణతో పాటు పెన్షన్, ఉద్యోగ భద్రత తదితర డిమాండ్లతో ఏఐబీఈఏ ( అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం) తో పాటు బీఈఎఫ్ఐ (బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య) సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆ రెండు రోజులు విధులు బహిష్కరించాల్సిందిగా ఉద్యోగులకు సూచించాయి. ఈనేపథ్యంలో దాదాపు 10 కార్మిక సంఘాలు ఓక చెప్పడమే గాకుండా 2 రోజుల సమ్మెకు ఐబీఏ (భారత బ్యాంకుల సంఘం)కు నోటీసులిచ్చాయి.
డిమాండ్ల సాధనకై సమ్మెబాట..!
కేంద్ర ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందనేది ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగుల ఆవేదన. బ్యాంకుల విలీనంతో ఉద్యోగ భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న సిబ్బంది పలు డిమాండ్లను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. అయినా కేంద్రం తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వస్తోందని చెబుతున్నారు. వరుస సమ్మెల కారణంగా ఖాతాదారులకు ఇబ్బంది కలుగుతున్నప్పటికీ.. తమవైపు నుంచి కూడా ఆలోచిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం వైఖరిపై నిరసన.. సమ్మె సైరన్
బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలకు ఢోకాలేదని.. అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. దీంతో ఉద్యోగుల్లో కాస్తా అనుమానాలు తొలగినట్లు కనిపించినా.. ఇతరత్రా డిమాండ్లపై పట్టుబట్టారు. అందులోభాగంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ దఫాదఫాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. డిసెంబర్ చివరలో వారం వ్యవధిలోనే రెండుసార్లు సమ్మెకు పిలుపునిచ్చిన ఉద్యోగులు.. తాజాగా 8,9 తేదీల్లో బంద్ పాటించనున్నారు. 2 రెండు రోజుల సమ్మెతో బ్యాంకింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. దాదాపు 10 కార్మిక సంఘాలు తోడవ్వడంతో పెద్దఎత్తున కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.
వారంలో రెండు.. నెల వ్యవధిలో మూడు
వరుస బ్యాంకుల సమ్మెలతో ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమ్మెలతో ప్రైవేట్ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తున్నా.. ఎక్కువమంది ఖాతాదారులున్న ప్రభుత్వరంగ బ్యాంకులు సమ్మె కారణంగా మూతపడుతుండంతో ఇబ్బందులు పడుతున్నారు. డిసెంబర్ నెలలో 21వ తేదీన సమ్మెకు దిగారు ఉద్యోగులు. 22న రెండో శనివారం, 23న ఆదివారం, 25న క్రిస్మస్ సెలవు అలా సమ్మెతో పాటు వరుస సెలవులతో ఖాతాదారులకు కష్టాలు తప్పలేదు. అనంతరం డిసెంబర్ 26న మళ్లీ సమ్మె చేపట్టారు. వారం వ్యవధిలోనే రెండు సార్లు సమ్మెకు దిగడం కొసమెరుపు. మొత్తానికి నెల వ్యవధిలోనే మూడుసార్లు బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగడం గమనార్హం.