దయచేసి వెండి ఇటుకలు విరాళాలుగా ఇవ్వొద్దు: రామ మందిర ట్రస్ట్ వినతి, కారణమిదే
లక్నో: అయోధ్య రామ మందిర నిర్మాణానికి హిందువుల నుంచి భారీగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రూ. వెయ్యి కోట్లకుపైగా విరాళాలు అందాయి. అయితే, కొంత మంది రామునిపై భక్తితో బంగారు, వెండి ఇటుకలను కూడా విరాళంగా ఇస్తున్నారు.
ఎక్కువ మంది వెండి ఇటుకలు విరాళంగా ఇస్తుండటంతో బ్యాంకు లాకర్లు నిండిపోయాయి. దీంతో వెండి ఇటుకలు విరాళంగా వద్దని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దాతలకు తెలిపింది. దయచేసి వెండి ఇటుకలను విరాళంగా ఇవ్వడం నిలిపివేయాలని కోరింది.
ఇప్పటికే 400 కిలోలకుపైగా వెండి ఇటుకలు విరాళాలుగా వచ్చాయని ది ప్రింట్ తన కథనంలో పేర్కొంది. రామాలయం నిర్మాణం కోసం దేశ నలుమూలల నుంచి కూడా భక్తులు వెండి ఇటుకలను పంపిస్తున్నారని, భారీ సంఖ్యలో వస్తున్న వాటిని నిల్వ చేయడం సమస్యగా మారిందని ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు.
ఈ కారణంగానే తాము వెండి ఇటుకలను పంపవద్దని కోరుతున్నామని ఆయన చెప్పారు. తమ అన్ని బ్యాంకు లాకర్లు కూడా నిండిపోయాయని చెప్పారు. రామ భక్తుల మనోభావాలను తాము గౌరవిస్తామని, అయితే, ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని భక్తులు ఇకమీదట వెండి ఇటుకలను పంపవద్దని ఆయన విన్నవించారు. రామ మందిర నిర్మాణం కోసం అవసరమైతే మరోసారి తాము కావాలని కోరుతామని చెప్పారు.
రామ మందిర నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ. 1600 కోట్ల సేకరించినట్లు ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. డబ్బు ట్రస్ట్ ఖాతాలో వేయాలని లేదా చెక్కుల రూపంలో కూడా స్వీకరిస్తామని చెప్పాయి. ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ఇంతకుముందు మాట్లాడుతూ.. లక్షా 50వేల గ్రూపులు విరాళాలు సేకరిస్తున్నాయని తెలిపారు. 39 నెలల్లో రామ మందిర నిర్మాణం పూర్తవుతందని వివరించారు.