మోడీకి తెలియదు! అంతా నీవల్లే, రాజీనామా చెయ్: ఆర్బీఐ గవర్నర్కు సెగ
నోట్ల రద్దు నేపథ్యంలో చూపిన ప్రభావాలపై ఎలాంటి అధ్యయనం చేయకుండా ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పెద్ద నోట్ల రద్దుకు సిఫారసు చేశారని, ఆయన రాజీనామా చేయాలని బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య ఆరోపించింది.
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో చూపిన ప్రభావాలపై ఎలాంటి అధ్యయనం చేయకుండా ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పెద్ద నోట్ల రద్దుకు సిఫారసు చేశారని బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య ఆరోపించింది. ఢిల్లీలో అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షుడు ఫ్రాంక్ మాట్లాడారు.
వివిధ దేశాల్లో నోట్ల రద్దు ఎలాంటి పరిస్థితులకు దారితీసిందో సరిగ్గా అధ్యయనం చేయలేదన్నారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ వెంటనే పదవికి రాజీనామా చేయాలన్నారు. ఆర్బీఐని అభివృద్ధి బాటన నడిపించాల్సిన ఉర్జిత్ ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి తప్పుడు సలహాలు ఇచ్చారన్నారు.
బ్యాంకులపై ఒత్తిడి కారణంగా బ్యాంకుల్లో దొంగ నోట్లు జమ అవుతున్నాయన్నారు. రూ.2,000 నోట్లు ముద్రించాల్సిన చోట వాటిని ముద్రించకుండా, బ్యాంకులకు చెడిపోయిన రూ.100 నోట్లను ఆర్బీఐ విడుదల చేస్తోందన్నారు. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారన్నారు.
ఆయన పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెద్దనోట్ల రద్దుతో దేశంలో ఆర్థికంగా తీవ్ర అనిశ్చితి నెలకొందని, నోట్ల మార్పిడి కోసం జనం క్యూ లైన్లలో నిలబడి పిట్టల్లా రాలిపోతున్నారని, పని ఒత్తిడి పెరగడంతో గత పన్నెండు రోజుల్లో దేశవ్యాప్తంగా 11మంది బ్యాంకు అధికారులు మరణించారన్నారు.
ఈ విపరిణామాలన్నింటికీ ఉర్జిత పటేల్దే బాధ్యత అన్నారు. ఇందుకు నైతిక బాధ్యతగా ఆయన సత్వరమే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. రద్దు విషయంలో ఆర్బీఐ ఏమాత్రం ప్రణాళికా బద్ధంగా వ్యవహరించలేదన్నారు. ఈ విషయంలో మిగతా దేశాల అనుభవాలను, లేదంటే స్వయంగా తమ గత అనుభవాలను అయినా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిందన్నారు.
1978లో అప్పటి ప్రభుత్వం నోట్లరద్దుకు ఉపక్రమించినప్పుడు అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఐజీ పటేల్ తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. ప్రధాని మోడీ గానీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీగానీ ఆర్థికవేత్తలు కారన్నారు. అయితే ఓ ఆర్థికవేత్తగా ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత పటేల్ నోట్లరద్దు రూపంలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోవడంలో దారుణంగా విఫలమయ్యారన్నారు. రద్దుపై రోడ్డు మ్యాప్ కరువైందన్నారు.