బ్యాంకర్ల బ్లాక్ దందా: డిపాజిట్ చేసేముందు తస్మాత్ జాగ్రత్త!
లూథియానాలో విక్రమ్ శర్మ అనే ఖాతాదారుడు ఇచ్చిన ఫిర్యాదుతో బ్యాంకర్ల బ్లాక్ దందా బాగోతం వెలుగుచూసింది.
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో.. దేశంలోని కొంతమంది బడాబాబుల వద్ద కోట్ల కొద్ది విలువచేసే కొత్త నోట్లు వెలుగుచూస్తుండడం బ్యాంకర్లపై అనుమానాలు లేవనెత్తుతోంది. దీనికి బలాన్ని చేకూర్చేలా లూథియానాలో ఓ సంఘటన వెలుగుచూసింది.
విక్రమ్ శర్మ అనే లూథియానాకు చెందిన ఓ వ్యక్తి.. తన ఖాతాలో రూ.50వేలు బ్యాంకు ద్వారా డిపాజిట్ చేశాడు. ఇందులో రూ.2వేల నోట్లు-15, రూ.100నోట్లు-200 ఉన్నాయి. డినామినేషన్ లో కూడా ఈ విషయం స్పష్టంగా రాసుంది. అయితే విక్రమ్ శర్మ సెల్ ఫోన్ కు మాత్రం రూ.43వేలు ఒకసారి, రూ.7వేలు మరోసారి, ఇలా రెండు దఫాలుగా డిపాజిట్ అయినట్టు సెల్ ఫోన్ మెసేజ్ వచ్చింది.
అనుమానం వచ్చిన విక్రమ్ శర్మ బ్యాంకు అధికారులను నిలదీయడంతో.. వారు నీళ్లు నమిలినట్టుగా తెలుస్తోంది. దీంతో సదరు బ్యాంకర్ల అసలు బాగోతం బయటపడింది. ఈ సంఘటనను బట్టి అర్థమవుతున్నదేంటంటే.. దేశంలో పలువురు బ్యాంకర్లు నల్లకుబేరులతో ఒప్పందాలు చేసుకుని కమిషన్ పద్దతిన బ్లాక్ ను వైట్ చేసే పనిని ముందేసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే.. విక్రమ్ శర్మ చేసిన డిపాజిట్ లో రూ.2వేల విలువ చేసే 15 కొత్త నోట్లు ఉండగా.. వాటిని నల్లకుబేరులకు ముట్టజెప్పి, ఆ నల్లకుబేరులు ఇచ్చిన పాతనోట్లను సదరు డిపాజిటర్ ఖాతాలో జమకట్టినట్టు తెలుస్తోంది. దీని ద్వారా అసలైన నల్లకుబేరులు తప్పించుకుని, సాధారణ జనం మీద ఐటీ అధికారుల కన్నుపడే అవకాశముంది కాబట్టి.. ఖాతాదారులు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే.