అదానీ గ్రూప్ పేరు చెప్పకుండా బ్యాంకింగ్ రంగ పరిస్థితిపై ఆర్బీఐ క్లారిటీ
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ నివేదికతో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ కోట్లలో నష్టపోతోంది. స్టాక్ మార్కెట్లలోనూ కొంత అలజడి నెలకొంది. అయితే, ఇప్పుడు సాధారణంగానే కొనసాగుతున్నాయి. అదానీ గ్రూప్ నష్టాలపై ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించగా.. తాజాగా, ఆర్బీఐ కూడా కీలక వ్యాఖ్యలు చేసింది.
అదానీ గ్రూప్ కంపెనీలకు రుణాలు ఇచ్చిన బ్యాంకుల పరిస్థితిపైనా ఆర్బీఐ తొలిసారి స్పందించింది. అదానీ గ్రూప్ షేర్లు పడిపోతున్నప్పటికీ.. దేశంలోని బ్యాంకింగ్ రంగం నిలకడగా, స్థిరంగా ఉందని స్పష్టం చేసింది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.
ఆర్బీఐ రెగ్యులేటర్, సూపర్వైజర్గా.. ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడానికి బ్యాంకింగ్ సెక్టార్పై, వ్యక్తిగత బ్యాంకులపై నిరంతరం నిఘా ఉంచుతుందని తెలిపింది. అయితే, తన ప్రకటనలో అదానీ గ్రూపు పేరును పేర్కొనలేదు.
'ఒక వ్యాపార సమ్మేళనానికి భారతీయ బ్యాంకుల బహిర్గతం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ మీడియా నివేదికలు ఉన్నాయి... ప్రస్తుత అంచనా ప్రకారం, బ్యాంకింగ్ రంగం స్థితిస్థాపకంగా, స్థిరంగా ఉంది. మూలధన సమృద్ధి, ఆస్తి నాణ్యత, లిక్విడిటీ, ప్రొవిజన్ కవరేజ్, లాభదాయకతకు సంబంధించిన వివిధ పారామితులు బాగున్నాయి. బ్యాంకులు కూడా లార్జ్ ఎక్స్పోజర్ ఫ్రేమ్వర్క్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయి' ఆర్బీఐ వెల్లడించింది.
'ఆర్బిఐకి సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (సిఆర్ఐఎల్సి) డేటాబేస్ సిస్టమ్ ఉంది, ఇక్కడ బ్యాంకులు రూ. 5 కోట్ల కంటే ఎక్కువ ఎక్స్పోజర్ని నివేదిస్తాయి, ఇది పర్యవేక్షణ ప్రయోజనాల కోసం ఉపయోపడుతుంది' అని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.
మరోవైపు, అదానీ గ్రూప్ నష్టాల నేపథ్యంలో ఇప్పటికే ఈ గ్రూప్ నకు రుణాలు ఇచ్చిన బ్యాంకులను.. రుణాలకు సంబంధించిన వివరాలు అందజేయాల్సిందిగా భారత రిజర్వు బ్యాంక్ కోరినట్లు తెలిసింది. అయితే, అదానీ గ్రూప్నకు ఎల్ఐసీ, ఎస్బీఐ ఇచ్చిన మొత్తం చాలా తక్కువేనని ఆ సంస్థలు పేర్కొన్నాయి.