షాకింగ్: రూ.1 చెల్లించలేదని లక్షల విలువ బంగారాన్ని ఇవ్వని బ్యాంకు
కాంచీపురం: విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వంటి వారు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో లోన్లు తీసుకొని విదేశాలకు పారిపోయారు. కానీ బ్యాంకులు లేదా ఇతర సంస్థల నుంచి చిన్న మొత్తం తీసుకున్న వారిని మాత్రం డబ్బు కట్టమంటూ వేధిస్తుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి తమిళనాడులో వెలుగు చూసింది.
మరీ షాకింగ్ విషయం ఏమంటే ఓ సామాన్యుడు తాను లోన్గా తీసుకున్న డబ్బు మొత్తాన్ని చెల్లించాడు. కానీ వారి లెక్కల్లో ఒక్క రూపాయి ఇంకా చెల్లించాలి అని రికార్డు అయి ఉంది. దీంతో అతను తనఖా పెట్టిన లక్షలాది రూపాయల బంగారు నగలను ఇచ్చేందుకు నిరాకరించారు.
ఈ సంఘటన తమిళనాడులోని కాంచీపురంలో చోటు చేసుకుంది. ఇక్కడి కో-ఆపరటేవ్ బ్యాంకు కేవలం రూ.1 బాకీ ఉన్నాడని అతనికి చెందిన రూ.3.5 లక్షల విలువ చేసే 169 గ్రాముల బంగారాన్ని ఇవ్వలేదు. గత కొన్నేళ్ల నుంచి తన బంగారాన్ని ఇవ్వకపోవడంతో అతను సహకార బ్యాంకును కోర్టుకు లాగాడు.
కాంచీపురంలోని పల్లవరమ్ బ్రాంచి కో-ఆపరేటివ్ బ్యాంకులో సి కుమార్ అనే వ్యక్తి మూడు పర్యాయాలు లోన్ తీసుకున్నారు. అతను తొలుత 31 గ్రాముల బంగారాన్ని 6 ఏప్రిల్ 2010 తాకట్టు పెట్టి రూ.1.23 లక్షల లోన్ తీసుకున్నారు. 9 ఫిబ్రవరి 2011న 85 గ్రాముల బంగారం పెట్టి రూ.1.05 లక్షల లోన్ తీసుకున్నాడు. ఆ తర్వాత మరో 53 గ్రాముల బంగారంతో రూ.60వేల లోన్ తీసుకున్నాడు.
అయితే అతను మొదటిసారి తీసుకున్న లోన్కు సంబంధించి రూ.1 (ఒక్క రూపాయి) పెండింగులో ఉంది. ఆ తర్వాత తీసుకున్న రెండు లోన్లను చెల్లించాడు. కానీ ఒక్క రూపాయి కోసం అతని బంగారాన్ని అప్పగించలేదు.
దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బ్యాంకు పైన క్రిమినల్ కేసు నమోదు చేశారు. అయితే తన బంగారు నగల విషయంలో అనుమానం వ్యక్తం చేసిన సదరు వ్యక్తి రిట్ పిటిషన్ దాఖలు చేశారు.