3 రోజుల్లో 30 వేల కోట్లు పంపిణీ: అదుర్దా వద్దని వినతి
ముంబై: పెద్ద నోట్లు రద్దయినప్పటి నుంచి ఆదివారం సాయంత్రం పొద్దుపోయేవరకు 30వేల కోట్ల రూపాయలను బ్యాంకులు వినియోగదారులకు అందించాయి. దేశంలోని బ్యాంకుల వ్యవస్థ ప్రజావసరాలకు తగ్గట్టుగా అన్ని విభాగాలను ముమ్మరంగా పనిచేయించడంలో కొన్ని లోటుపాట్లున్నా నగదు పంపిణీ చురుగ్గా సాగిందని భారత బ్యాంకుల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ నెల 10వ తేదీ నుంచి తగిన గుర్తింపు కార్డుతో నాలుగువేల రూపాయలను పాతనోట్లతో మార్చుకునే అవకాశాన్ని కల్పించిందని, ఈ విధంగా కూడా భారీగానే నగదు పంపిణీ జరిగిందని తెలిపింది. అయితే కేవలం బ్యాంకుల నుంచి తీసుకునే నగదుపైనే ఆధారపడకుండా తమ చెల్లింపులను ఎలాంటి ఇబ్బంది లేకుండా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చేసుకోవాలని కోరింది.
బ్యాంకుల వద్ద తగినంత నగదు ఉందని, అందువల్ల జనం ఆదుర్దా పడి పదే పదే బ్యాంకులకు, ఎటిఎంలకు వెళ్లాల్సిన పని లేదని రిజర్వ్ బ్యాంక్ ఆదివారం స్పష్టం చేసింది. ఆదివారం కూడా దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు, ఎటిఎంల వద్ద జనం రద్దీ తగ్గలేదన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆర్బిఐ ఈ ప్రకటన చేసింది.
ఆర్బిఐ దగ్గర, బ్యాంకుల దగ్గర వంద రూపాయలు, ఇతర చిల్లర నోట్లు చాలినన్ని ఉన్నాయని, జనం ఆదుర్దా చెంది పదే పదే బ్యాంకులకు, ఎటిఎంలకు రావలసిన పనిలేదని, ఎప్పుడు అవసరమైతే అప్పుడే నగదు తీసుకోవచ్చని ఆర్బిఐ ఒక ప్రకటనలో తెలిపింది.