చట్టం ద్వారా బ్యాంకులు, టెలికాం కంపెనీలను ఆధార్తో అనుసంధానం చేయొచ్చు: జైట్లీ
బ్యాంకు ఖాతాలకు, మొబైల్ ఫోన్ కనెక్షన్లకు ఆధార్ నెంబరు అనుసంధానం పార్లమెంటులో చట్టం చేస్తే జరుగుతుందన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. అయితే చట్టం చేస్తారా లేదా అనేదానిపై మాత్రం స్పష్టం చేయలేదు. గత నెలలో బ్యాంకు ఖాతాలకు, మొబైల్ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆధార్ రాజ్యాంగ బద్ధమే అయినప్పటికీ ప్రైవేట్ సంస్థలతో ఆధార్ అనుసంధానం చేయాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
బ్యాంక్ అకౌంట్, మొబైల్కు నో, ఐటీకి ఇవ్వాలి: ఆధార్ ఎక్కడ అవసరం, ఎక్కడ అవసరం లేదు?
" ఆధార్ పౌరసత్వం కార్డు కాదు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేరుతాయి. ఈ క్రమంలోనే అవకతవకలు జరగకుండా ఆధార్ నెంబర్తో అనుసంధానం చేస్తే ఎలాంటి అవకతవకలు జరగవు. కేవలం దీనికోసమే ఆధార్ కార్డు ముఖ్య ఉద్దేశం"అని అరుణ్ జైట్లీ చెప్పారు. చట్టంలో సెక్షన్ 57 అన్ని అధికారాలు ఇస్తుందని ఇది ప్రయోగించి చట్టం చేసే వీలు ఉందని అరుణ్ జైట్లీ అన్నారు. అంతేకాదు చట్టపరమైన ప్రక్రియ ద్వారా తిరిగి బ్యాంకు ఖాతాలకు మొబైల్ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం చేయొచ్చని జైట్లీ తెలిపారు.
ఆదాయం పన్నుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాబట్టి సుప్రీంకోర్టు ఒప్పుకుందని అలానే మొబైల్ ఫోన్లకు ఆధార్ అనుసంధానం ఎంత ఉపయోగకరంగా ఉంటుందో కోర్టు దృష్టికి తీసుకెళితే ఇందుకు కూడా కోర్టు ఒప్పుకునే అవకాశం ఉందని చెప్పారు. మొబైల్ బ్యాంకు ఖాతాలు రెండు చాలా క్లిష్టమైన సబ్జెక్టులని జైట్లీ అభిప్రాయపడ్డారు. ప్రతి పౌరుడికి ఆధార్ ఇవ్వడాన్ని రాజ్యాంగబద్దమే అంటూ సుప్రీంకోర్టు పేర్కొందన్న జైట్లీ... ప్రభుత్వ పథకాలకు ఓకే చేసి కొన్ని ప్రైవేట్ కంపెనీలకు అనుసంధానం చెల్లదని చెప్పడం కొంత అసంతృప్తినిచ్చిందన్నారు.