భారత ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడానికి ఈ నిర్ణయాలే కారణం: రఘురాం రాజన్
పెద్ద నోట్ల రద్దు నిర్ణయమే భారత ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యేలా చేసిందని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. అంతేకాదు పెద్ద నోట్ల ప్రభావం స్థూల దేశీయోత్పత్తి జీడీపీపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ఇందుకు సంబంధించి పలు పరిశోదనలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వెల్లడించారు. అధిక విలువ కలిగి ఉన్న పెద్ద నోట్ల రద్దు అప్పటికే క్రమంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ప్రస్తుతం ఆ ప్రభావం ఇంకా భారత ఆర్థిక వ్యవస్థపై చూపిస్తోందని అందుకే ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ మందగించిందని చెప్పారు.
2017లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా వేగం పుంజుకోగా భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం నత్తనడకన సాగిందన్నారు. ఒక్క డీమోనిటైజేషన్ ద్వారానే ఇండియన్ ఎకానమీ కుదేలు కాలేదన్న రఘురాం... ఇందుకు జీఎస్టీ కూడా తోడైందని చెప్పారు. 2017-18 భారత ఆర్థిక వ్యవస్థ 6.7శాతం మాత్రమే వృద్ధి చూసిందన్నారు. కేవలం పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ విధానాలే కొంపముంచాయని చెప్పారు. జీఎస్టీకి తాను వ్యతిరేకమని అందుకే ఈ వ్యాఖ్యలు చేస్తున్న వారికి అర్థమయ్యేలా తాను చెప్పదలుచుకున్నట్లు రఘురాం రాజన్ స్పష్టం చేశారు. దీర్ఘకాలంలో జీఎస్టీ బాగానే ఉంటుంది కానీ... ప్రస్తుత పరిణామాలు చూస్తే ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతోందని హెచ్చిరించారు. తను ఆర్బీఐ గవర్నర్గా ఉన్న సమయంలో పెద్ద నోట్ల రద్దును అమలు చేయాలని ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఏమైనా వచ్చిందా అన్న ప్రశ్నకు.... కేవలం పెద్ద నోట్ల రద్దుపై తన అభిప్రాయం ఏమిటని మాత్రమే కేంద్రపెద్దలు అడిగారని అయితే అది మంచి ఆలోచన కాదని తాను చెప్పినట్లు రాజన్ వెల్లడించారు.
ఇక జీఎస్టీ గురించి మాట్లాడిన బ్యాంకు మాజీ బాస్ రఘురాం రాజన్.... జీఎస్టీని ఇంకొంత మంచి విధానంలో అమలు చేసి ఉంటే బాగుండేదన్నారు. జీఎస్టీకి ఒకే రేటు విధానం ఉండాలా లేక ఐదు స్లాబుల పద్ధతిలో ఉండాలా అన్న ప్రశ్నకు ఇది చర్చల ద్వారానే తెలుస్తుందన్నారు. ఒక నిర్ణయం తీసుకున్నాక అందులోని లోటుపాట్లు కనిపిస్తే వాటిని మళ్లీ పరిష్కరించ వచ్చు కానీ... ఒకదాని వెంట ఒక సమస్య వచ్చి పడుతుంటే ఆ ఆలోచనే సరైంది కాదని అన్నారు. ఇక బ్యాంకు నుంచి అధిక మొత్తంలో రుణం పొంది ఎగవేసే వారిగురించి ప్రశ్నించగా... అలాంటి వారిని ఒక్కరిని జైలులో పెడితే మిగతావారు అలర్ట్ అయి తీసుకున్న డబ్బును తిరిగి చెల్లిస్తారని చెప్పారు.