అమ్మ.. నీ చివరి కోరిక తీర్చా... సాల్వేకు రూపాయి అందజేసిన బన్సూరి స్వరాజ్
వారసులు.. తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి. పేరెంట్స్కు మరింత మంచి పేరు తీసుకురావాలి. ఏ తల్లిదండ్రి అయినా కోరుకునే విషయం ఇదే. దివంగత మాజీ కేంద్రమంత్రి సుష్మ స్వరాజ్ కూతురు బన్సూరీ స్వరాజ్ కూడా ఇలానే వ్యవహరించారు. తన తల్లి చివరి కోరికను తీర్చి.. శెభాష్ అనిపించుకున్నారు. ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వేకు రూ.1 ఫీజు అందజేసి తల్లికి తగ్గ తనయ అనిపించుకున్నారు.
ఉద్యోగం పోయింది.. భార్య, కవల పిల్లలతో కలిసి టెకీ...
ఇదీ నేపథ్యం..
భారత మాజీ నేవి అధికారి కుల్భూషణ్ జాదవ్ను ఇరాన్లో పాకిస్థాన్ సైనికులు అదుపులోకి తీసుకున్నారు. గూఢచర్యం అభియోగాలను పాకిస్థాన్ సైనిక కోర్టులో మోపారు. అతనికి ఉరిశిక్ష కూడా విధించారు. దీనిని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. అంతర్జాతీయ కోర్టులో సవాల్ చేసింది. భారత్ తరఫున ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ఐసీజేలో బలంగా వాదనలు వినిపించి.. ఉరిశిక్షను నిలిపివేయించేలా చేశారు. దీంతో అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ విజయం సాధించింది. ఇందులో ప్రధాన పాత్ర పోషించింది మాత్రం సాల్వేనే.
రూ.1 ఇస్తానని మాట
అప్పటి విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కేసు గెలిచినందుకు రూ.1 ఇస్తానని పేర్కొన్నారు. కానీ ఆమె అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. తీవ్ర అనారోగ్యంతో చనిపోయారు. తాను సాల్వేకు ఫీజు బాకీ ఉన్నానని ట్వీట్ కూడా చేశారు. చివరి కోరిక తీర్చలేదని మదనపడ్డారు. ఎట్టకేలకు ఆమె చివరి కోరికను కూతురు బన్సూరీ స్వరాజ్ తీర్చారు.
తల్లికి తగ్గ తనయ
తన తల్లి చివరి కోరికను శుక్రవారం బన్సూరీ స్వరాజ్ తీర్చారు. ఆమె తన తండ్రి స్వరాజ్ కౌశల్తోపాటు హరీశ్ సాల్వే ఇంటికెళ్లారు. తన తల్లి ఇస్తానన్న రూపాయి ఫీజు అందజేశారు. ఆమె ఫీజు ఇస్తుండగా స్వరాజ్ కౌశల్ ఫోటో తీశారు. తర్వాత ఆయన ట్వీట్ చేశారు. సుష్మ స్వరాజ్ చివరి కోరికను బన్సూరి తీర్చారని అందులో పేర్కొన్నారు. ఈ ట్వీట్ను నెటిజన్లు అభినందిస్తున్నారు. శెభాష్ బన్సూరీ అంటూ కీర్తిస్తున్నారు. తల్లికి తగ్గ తనయ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
అనారోగ్యంతో మృతి
బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్ అనారోగ్యంతో ఆగస్టు 6న మృతిచెందిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో ఢిల్లీలోని ఎయిమ్స్లో కన్నుమూశారు. కొన్నాళ్ల క్రితం ఆమె కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయించుకున్న సంగతి తెలిసిందే. 2016లో ఆమె ఆరోగ్యం కోలుకున్నది అని అనుకునేలోపు.. మళ్లీ సమస్య తిరగబెట్టింది. దీంతో ప్రత్యక్ష రాజకీయాలకు అంటిముట్టనట్టుగానే వ్యవహరించారు. అనారోగ్య సమస్యలతో 2019 సార్వత్రిక ఎన్నికలకు కూడా సుష్మ స్వరాజ్ దూరంగా ఉన్నారు.