ప్రశంస: ఒబామా, మిచెల్లీ మనసుదోచిన ఢిల్లీ 'ఐటీసీ మౌర్య' హోటల్
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన భారత్ పర్యటన సందర్భంగా ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్లో విడిది చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆ హోటల్ సిబ్బంది పైన ప్రశంసలు కురిపించారు. అద్భుతమైన ఆతిథ్యం అంటూ కితాబిచ్చారు.
బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్లీ ఒబామాలు ఐటీసీ మౌర్యలో జనవరి 25వ తేదీ నుండి జనవరి 27 వరకు ఉన్నారు. వీరికి రెండు పడక గదులు, పెద్ద భోజనాలయం, స్టడీ, ఇతర వసతులున్న ప్రత్యేకమైన గ్రౌండ్ ప్రెసిడెన్షియల్ విభాగాన్ని కేటాయించారు. ఒబామా ప్రతి రోజూ ఈ హోటల్లోని జిమ్నే వినియోగించుకున్నారు.
హోటల్లోని వెస్ట్ వ్యూ రెస్టారెంట్ నుండే జనవరి 26న భారత సీఈవోలతో జరిగిన విందు సమావేశానికి భోజనం వెళ్లింది. ఒబామా ఎలాంటి అరమరికలు లేకుండా అందరితో కలివిడిగా గడిపారని పలువురు ప్రశంసించారు. అదే సమయంలో మిచెల్ ఎంపిక చేసిన కొందరు వ్యక్తులతో ఇదే హోటల్లోని బుఖారా రెస్టారెంటులో విందు చేశారు.
కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, ప్రకాశ్ జవదేకర్, నిర్మలా సీతారామన్ తదితరులు అమెరికాకు చెందిన సంబంధిత శాఖల మంత్రులతో ఇదే హోటల్లోని దమ్ పఖ్త్ రెస్టారెంటులో విందులో పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలు ఒబామాను ఐటీసీ మౌర్యలో కలిశారు.