బస్తర్ దాడి ఘటన: మా లక్ష్యం మీడియా కాదు... అచ్యుతానంద్ను పొరపాటున చంపాం అన్న మావోలు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో మూడురోజుల క్రితం జరిగిన మావోయిస్టుల దాడిలో దూరదర్శన్ ఛానెల్కు చెందిన కెమెరామెన్ అచ్యుతానంద్ సాహూ మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై మావోయిస్టులు ఓ లేఖను విడదుల చేశారు. తమ లక్ష్యం మీడియా కానే కాదని లేఖలో పేర్కొన్నారు. అచ్యుతానంద సాహూ తమ టార్గెట్ కాదని అతన్ని ఉద్దేశపూర్వకంగా చంపలేదని లేఖలో వెల్లడించారు. అయితే మావోలు చెప్పిన మాటలను పోలీసులు కొట్టిపారేశారు. వారు మీడియా లక్ష్యంగానే దాడికి తెగబడ్డారని పోలీసులు తెలిపారు.
Recommended Video
అచ్యుతానంద్ను పొరపాటున చంపాం
బస్తర్ ఎన్నికలను కవర్ చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన దూరదర్శన్ బృందం అక్కడకు వెళ్లింది. అక్కడ నిలవాయాలోని కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్బూత్పై రిపోర్టింగ్ ఇచ్చేందుకు బృందం వెళ్లింది. అదే సమయంలో మావోలు దాడికి తెగబడ్డారు. కెమెరామెన్ అచ్యుతానంద సాహూను మావోలు తీసుకెళ్లి కాల్చిచంపినట్లు లేఖలో ఉంది. అయితే ఇది కావాలని చేసింది కాదని ... పొరపాటున జరిగిన ఘటనగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ మావోయిస్టుల తీరును కొట్టిపారేశారు. ఒకవేళ నిజంగానే అచ్యుతానంద్ను ఉద్దేశపూర్వకంగా చంపలేదని భావిస్తే... అతని కెమెరాను ఎందుకు లూటీ చేశారు అని ప్రశ్నించారు ఎస్పీ. కెమెరాలో దాడికి ముందు అన్ని విషయాలు స్పష్టంగా రికార్డ్ అయి ఉన్నాయి కాబట్టి అచ్యుతానంద్ను చంపి ఆ కెమెరాను మావోయిస్టులు లాక్కెల్లారని చెప్పారు.
ఇది ముమ్మాటికీ మీడియా టార్గెట్గా జరిగిన దాడి: ఎస్పీ
ఇక చనిపోయిన అచ్యుతానంద్ శరీరాన్ని పరిశీలిస్తే అతని శరీరంలోకి బుల్లెట్లు చాలా దూసుకెళ్లాయని, తన తల ఫ్రాక్చర్ అయిన ఆనవాలు కనిపించాయని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఇది కచ్చితంగా మావోలు కావాలనే మీడియాను టార్గెట్ చేసుకున్నారనే విషయం స్పష్టమవుతోందన్నారు. ఇది పొరపాటు కానే కాదని ఎస్పీ చెప్పారు. ఇదిలా ఉంటే దూరదర్శన్ బృందం వెంటా భద్రతా సిబ్బంది ఆరుమోటార్ సైకిళ్లపై తోడుగా ఉన్నారు. సాధారణంగా ఇక్కడ మావోలు ల్యాండ్ మైన్లతో కార్లను వ్యాన్లను పేల్చివేస్తూ ఉంటారు. ఇందుకోసమే ఈ ప్రాంతంలో పోలీసులు ఎక్కువగా మోటార్ సైకిళ్లను వినియోగిస్తుంటారు.
నా కళ్లముందే అచ్యుతానంద్ శరీరంలోకి బుల్లెట్ దూసుకుపోయింది
ఉదయం 10:25 గంటలకు తమ ముందు భద్రతాసిబ్బంది ఉన్న మోటార్ సైకిల్ వెళుతోందని ... ఉన్నట్లుండి ఆ బైకు పడిపోయినట్లు చెప్పారు దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డ ధీరజ్ కుమార్ అనే వ్యక్తి. మోటార్ సైకిల్ పైనే కెమెరా మెన్ ఉన్నాడని వెంటనే ఆయన శరీరంలోకి బుల్లెట్ దూసుకుపోయిందని ధీరజ్ చెప్పారు. దీంతో అచ్యుతానంద్ కిందకు పడిపోయినట్లు వెల్లడించాడు. వెనకే ఉన్న తమ మోటార్ సైకిల్ కూడా బ్యాలెన్స్ తప్పి వారు కూడా కిందకు పడిపోయినట్లు ధీరజ్ వెల్లడించాడు. అయితే అదృష్టవశాత్తు ఓ గుంతలోకి తను పడిపోవడంతో అక్కడే దాక్కున్నట్లు చెప్పాడు. దీంతో ప్రాణాలు దక్కాయని చెప్పారు. మావోయిస్టుల ప్రభావం ఉన్న ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. తొలి దశ ఎన్నికలు నవంబర్ 12న జరగనుండగా... మలిదశ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి.