పెద్ద సంఖ్యలో చొరబడిన ఉగ్రవాదులు: శ్రీనగర్, ఢిల్లీలో హైఅలర్ట్
శ్రీనగర్: మనదేశంలో పాకిస్థాన్ మరోసారి ఉగ్రఘాతుకానికి తెగబడేందుకు కుట్రలు పన్నుతోందని తెలిసింది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) నుంచి జమ్మూకాశ్మీర్లోకి ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో చొరబడినట్లు భద్రతా అధికారులకు సమాచారం అందింది. దీంతో జమ్మూకాశ్మీర్తో పాటు దేశ రాజధాని ఢిల్లీ నగరంలోనూ భద్రతా సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు.
పాకిస్థాన్, జమ్మూకాశ్మీర్ సరిహద్దులోని నియంత్రణ రేఖ దాటుకుని దాదాపు 20 మంది ముష్కరులు కాశ్మీర్లోకి ప్రవేశించారని అధికారులు వెల్లడించారు. భారత్లోకి ప్రవేశించిన ఈ ఉగ్రవాదుల్లో ఎక్కువ మంది మౌలానా మసూద్ అజహర్కు చెందిన జైషే ఈ మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన వారని అధికారులు వెల్లడించారు.
ఈ క్రమంలో వీరు ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందనే ఆందోళనతో కాశ్మీర్ సహా ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. భద్రతా సిబ్బంది మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఇంటెలీజెన్స్ బ్యూరో అధికారులు హెచ్చరించారు. సున్నితమైన ప్రాంతాల్లో పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.
ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఉగ్రవాదులు దేశంలో చొరబడడం చాలా అరుదని అధికారులు చెబుతున్నారు. వీరు కాశ్మీర్లో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని, రెండు, మూడు రోజుల్లో దాడులు చేసే అవకాశం కూడా ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదుల పన్నాగాలను భగ్నం చేయాలని భద్రతాదళాలకు ఉన్నతాధికారులు పిలుపునిచ్చారు.