రాజ్యవర్థన్ వర్సెస్ కృష్ణ పునియా జైపూర్ రూరల్లో ఒలింపియన్ల ఫైట్
జైపూర్ : రాజస్థాన్లో ఆసక్తికర పోరు నెలకొంది. జైపూర్ రూరల్ నియోజకవర్గం నుంచి ఇద్దరు ఒలింపియన్లు బరిలో దిగుతున్నారు. ఒలింపియన్, కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్పై మరో ఒలింపియన్ను కాంగ్రెస్ బరిలో దింపింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించగా... బీజేపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. అదే జోరును కొనసాగిస్తూ కేంద్ర మంత్రిని ఓడించేందుకు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేను బరిలో దింపింది. ఇద్దరు ఒలింపియన్లు తలపడుతుండటంతో జైపూర్ రూరల్ రాజకీయం ఇంట్రెస్టింగ్గా మారింది.
జైట్లీ దేశద్రోహం వ్యాఖ్యలపై దుమారం కాంగ్రెస్ - బీజేపీల మధ్య మాటల యుద్ధం
రాథోడ్ వర్సెస్ పునియా
జైపూర్ రూరల్ లోక్సభ స్థానానికి ప్రస్తుతం కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ అధిష్టానం ఈసారి కూడా ఆయనకే ఆ స్థానాన్ని కట్టబెట్టింది. ఇదిలా ఉంటే 2014లో కోల్పోయిన సీటును తిరిగి దక్కించుకునే లక్ష్యంతో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణ పూనియాకు టికెట్ కట్టబెట్టింది. దీంతో 2013లో భారత్ తరఫున ఒలింపిక్స్ బరిలో దిగిన రాజ్యవర్థన్, కృష్ణ పూనియాలు ప్రస్తుతం ఎన్నికల మైదానంలో ప్రత్యర్థులుగా తలపడుతున్నారు.
రెండోసారి జైపూర్ బరిలో రాథోడ్
ఒలింపిక్స్లో సిల్వర్, కామన్వెల్త్లో గోల్డ్ మెడల్ సాధించిన షూటర్, ఆర్మీ కల్నల్ అయిన రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ 2013లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. రాజకీయాలపై ఆసక్తితో అదే ఏడాది బీజేపీలో జాయినయ్యారు. 2014లో జైపూర్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ నేత సీపీ జోషిని మట్టి కరిపించారు. పోటీ చేసిన తొలిసారే కేంద్రమంత్రిగా ఛాన్స్ కొట్టేశారు.
షాదల్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే
హర్యానాకు చెందిన కృష్ణ పునియా మూడుసార్లు ఒలింపిక్స్లో పాల్గొన్నారు. ఇటీవల జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో షాదల్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా కాంగ్రెస్ హై కమాండ్ కృష్ణ పునియాను లోక్సభ అభ్యర్థిగా ప్రకటించారు. రాజ్యవర్థన్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న జైపూర్ రూరల్ స్థానం నుంచి బరిలో దింపారు. రాథోడ్ ఓటమే లక్ష్యంగా పునియా ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. మహిళలు, యువత, రైతులను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.