దటీజ్ శివరాజ్.. పదేళ్ల తర్వాతా బీజేపీకే క్రేజ్: మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గెలుపు కష్టమే!
భోపాల్: త్వరలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, మేఘాలయలలో ఎన్నికలు జరగనున్నాయి. మూడుసార్లు గెలిచిన శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగోసారి గెలవడం కష్టమే అంటున్నారు. సాధారణంగా ఒకసారి గెలిస్తేనే ప్రజా వ్యతిరేకత ఉంటుంది. కానీ మూడుసార్లు గెలిచి, మళ్లీ గెలుపు బీజేపీకి ఒకింత ఇబ్బందే అంటున్నారు.
పైగా ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో 13 జిల్లాల్లోని 14 మున్సిపాలిటీల్లో 9 స్థానాల్లో కాంగ్రెస్ విజయపతాకం ఎగురవేసింది. ఈ ఏడాది జరిగిన రెండు ఉప ఎన్నికల్లో, గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. రైతులు అసంతృప్తితో ఉన్నారు. బీజేపీని ఓడించి, కాంగ్రెస్ గెలవడానికి ఇది మాత్రమే సరిపోదని అంటున్నారు.
ఎన్నికల వేడి: సీఎం బస్సు మీద వరుస రాళ్ల దాడులు, మాకు సంబంధం లేదు, కాంగ్రెస్!
ఈ అంశాల్లో కాంగ్రెస్ కంటే బీజేపీకే ఎక్కువ మార్కులు
కొన్ని నెలల క్రితం జరిగిన సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీ సర్వేలో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గారు. ఇతర సంస్థలు జరిపిన పలు సర్వేల్లోను బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి అధికారం మారుతుందని, కానీ అతి తక్కువ మెజార్టీతో అని తేలింది. వ్యాపమ్ స్కాం అంశాన్ని పక్కన పెడితే, రాష్ట్రంలో శివరాజ్ సింగ్ చౌహాన్కు ఇప్పటికీ మంచి ఆదరణ కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ కూడా ఆయననే సీఎంగా మళ్లీ చెబుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇప్పటి వరకు చెప్పలేదు. వ్యాపం స్కాం కేవలం మీడియాలో మాత్రమే కనిపించిందని, కాంగ్రెస్ మాత్రమే హడావుడి చేసిందని, కానీ జనాల్లోకి మాత్రం అంతగా వెళ్లలేదని చెబుతున్నారు. పైగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉన్నాయి. గ్రూపు విభేదాల విషయానికి వస్తే కాంగ్రెస్ కంటే బీజేపీ ఎన్నో రెట్లు మిన్నగా ఉంది. రెండు పార్టీల్లోని రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలను పోల్చుకున్నా బీజేపీకే ఎక్కువ మార్కులు పడతాయని అంటున్నారు.
2003 కంటే 2013లో మరింత పుంజుకున్న బీజేపీ
2003లో బీజేపీ 230 సీట్లకు గాను 173 సీట్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అప్పుడు బీజేపీ ఓటు షేర్ 42.5 శాతంగా ఉంది. 1993 నుంచి 2003 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2003లో కేవలం 38 సీట్లు గెలుచుకొని,31.6 శాతం ఓట్లు సాధించింది. 2008లో బీజేపీ ఓటు షేర్ 42.5 శాతం నుంచి 37.6 శాతానికి తగ్గింది. గెలిచిన సీట్లు 143. అప్పుడు కాంగ్రెస్ 71 స్థానాల్లో గెలిచింది. కానీ మూడోసారి 2013లో బీజేపీ మరోసారి అనూహ్యంగా పుంజుకుంది. 165 సీట్లు గెలవడంతో పాటు అంతకుముందు రెండుసార్ల కంటే ఎక్కువ ఓటు షేర్ సాధించింది. 44.9 శాతం ఓట్ షేర్ సాధించింది. కాంగ్రెస్ ఓటు శాతం 36.4 శాతానికి పడిపోయింది.
బీజేపీ గెలవడానికి ఐదు కారణాలు
బీజేపీ ముఖ్యంగా ఐదు స్థానాల్లో పట్టు సాధిస్తోంది. చంబల్, వింధ్య ప్రదేశ్, మహాకోషల్, మాల్వా ట్రిబాల్, మాల్వా నార్త్ ప్రాంతాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ముఖ్యమంగా 28 సీట్లు ఉన్న మాల్వా ట్రైబల్, 63 సీట్లున్న మాల్వా నార్త్లో మరింత ఆధిపత్యం కనబరుస్తోంది. ఈ రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతోంది. 49 సీట్లు ఉన్న మహాకోషల్ ప్రాంతంలోను బీజేపీకి మంచి పట్టు ఉంది. 34 సీట్లు ఉన్న చంబల్, 56 సీట్లున్న వింధ్య ప్రదేశ్లలో కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉంది. కానీ బీజేపీ ఒకింత పైచేయి సాధిస్తోంది. ఈ ప్రాంతాలు యూపీకి దగ్గరగా ఉంటాయి.
బీఎస్పీ ఫ్యాక్టర్
మధ్యప్రదేశ్లో బీఎస్పీ కూడా పదిహేనేళ్లుగా క్రమంగా తగ్గుతోంది. 2003లో పార్టీకి 7.3 శాతం ఓట్ షేర్, 2008లో 9 శాతం ఓట్ షేర్ ఉండగా, 2013లో మాత్రం 6.3 శాతం ఓట్ షేర్ మాత్రమే వచ్చింది. బీఎస్పీ ఇక్కడ క్రమంగా బలహీనపడింది. చంబల్, వింధ్య ప్రదేశ్లపై బీఎస్పీ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. ఈ రెండు ప్రాంతాల్లో బీఎస్పీ ఓట్ షేర్ క్రమంగా పెరిగి, ఆ తర్వాత కొంత తగ్గింది. చంబల్ ప్రాంతంలో 2003లో 13.7 శాతం, 2008లో 20.4 శాతం, 2013లో 15.6 శాతంగా ఉంది. వింధ్య ప్రదేశ్లో 2003లో 14.3 శాతం, 2008లో 14.7 శాతం, 2013లో 12 శాతంగా ఉంది. ఈ మూడు ఎన్నికల్లో బీఎస్పీ గెలిచింది కేవలం ఈ రెండు ప్రాంతాల్లోనే. ఇదే చంబల్, వింధ్య ప్రదేశ్లలో కాంగ్రెస్కు పట్టుంది. అక్కడే బీఎస్పీ బలపడుతోంది. ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చే అంశం. మిగతా మూడు ప్రాంతాల్లో బీజేపీకి గట్టి బలం ఉంది. ఈ లెక్కలు చూసుకుంటే కాంగ్రెస్ గెలుపు కష్టమేనని అంటున్నారు. ప్రజా వ్యతిరేకతను అధిగమించి బీజేపీ గెలుస్తుందా, లేక కాంగ్రెస్ గెలుస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్, బీఎస్పీ కలిస్తేనే ఇక్కడ బీజేపీని ఓడించడం కొంత సులభమని అంటున్నారు. లేదంటే కష్టమే అంటున్నారు.