తొలి బిజెపి ఎంపీగా రికార్డ్: లెఫ్ట్నెంట్గా అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ఎంపీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్కు సరికొత్త బాధ్యతలను చేపట్టారు. శుక్రవారం ఆయన భారత సైన్యంలో చేరినట్లు తెలిపారు. 41ఏళ్ల అనురాగ్ ఠాకూర్ను టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్గా ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ నియమించారు.
ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ.. ఇది తనకు లభించిన అరుదైన గౌరవంగా అభివర్ణించారు. దీంతో తన కల నెరవేరిందన్నారు. 'మా తాతయ్య ఆర్మీలో పనిచేశారు. చిన్నప్పటి నుంచి నేను కూడా ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని కలలు కనేవాడిని. ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాలో నా దేశ ప్రజలకు సేవ చేస్తా' అని పేర్కొన్నారు.
పార్లమెంట్ సభ్యుడిగా టెరిటోరియల్ ఆర్మీలో చేరిన తొలి బిజెపి ఎంపీ అనురాగ్ ఠాకూర్ కావడం విశేషం. ఠాకూర్ ఆర్మీలో చేరేందుకు పరీక్ష పాసయ్యారు. చండీగఢ్లో నిర్వహించిన ముఖాముఖికి వ్యక్తిగతంగా హాజరై, భోపాల్లో ఆర్మీ శిక్షణ కూడా పొందారు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని హమిర్పూర్ నియోజకవర్గ ఎంపీగా ఉన్న ఠాకూర్ టెరిటోరియల్ ఆర్మీలో రెగ్యులర్ ఆఫీసర్గా ఇక ఖచ్చితంగా శిక్షణ తీసుకోవాల్సి ఉంది. కాగా, ఠాకూర్ బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో ఆర్మీ ఛీఫ్ దల్బీర్ సింగ్, ఠాకూర్ తండ్రి హిమాచల్ప్రదేశ్ మాజీ సిఎం ప్రేమ్సింగ్ ధుమాల్ కూడా హాజరయ్యారు.
Earlier visuals of Anurag Thakur being commissioned into Territorial army in Delhi. pic.twitter.com/waVAOiZfgU
— ANI (@ANI_news) 29 July 2016
టెరిటోరియల్ ఆర్మీది భారత సైన్యంలో ద్వితీయ శ్రేణి. ఇందులోకి కేవలం స్వచ్ఛందంగా మాత్రమే చేరతారు. ఇది వృత్తి కాదు. ఉపాధిమార్గం కాదు. ఇప్పటికే ఇతర వృత్తుల్లో ఉన్న పౌరులను ఇందులో చేర్చుకుంటారు. వీరికి ఏడాదిలో ఒక నెల ప్రత్యేక మిలిటరీ శిక్షణ ఇస్తారు. దేశానికి అత్యవసర సైనికావసరాలు ఏర్పడిన సమయంలో భారత సైన్యం వీరి సేవలను వినియోగించుకుంటుంది.
కాగా, టెరిటోరియల్ ఆర్మీలో గతంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెడూల్కర్, టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింద్ ధోనీ కూడా టెరిటోరియల్ ఆర్మీలో కొంతకాలం పాటు సేవలందించారు.