ఖేల్ ఖతమ్: బౌలర్ శ్రీశాంత్పై జీవిత కాలం నిషేధం
న్యూఢిల్లీ: ఐపియల్ 6 ఎడిషన్లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడనే ఆరోపణలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్పై జీవిత కాలం నిషేధం విధించింది. అంకిత్ చవాన్లపై బిసిసిఐ జీవిత కాలం నిషేధం విధించింది. శుక్రవారం బిసిసిఐ క్రమశిక్షణా సంఘం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వారు ఇక క్రికెట్ ఆడే అవకాశాలు లేనట్లే. కాగా, బిసిసిఐ విడుదల చేసిన ప్రకటనలో అజిత్ చండిల ప్రస్తావన లేదు. చండిల విషయంపై తదుపరి దశలో చర్యలు తీసుకోనున్నట్లు బిసిసిఐ వర్గాలు చెప్పాయి.
కాగా, సిద్ధార్థ త్రివేదిపై ఏడాది పాటు, అమిత్ సింగ్పై ఐదేళ్లు నిషేధం విధించినట్లు బిసిసిఐ ఓ ప్రకటనలో తెలిపింది. సాక్ష్యాలు లేకపోవడంతో హర్మీత్ సింగ్పై కేసును మూసేశారు. ఐపియల్ ఆరో ఎడిషన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) తేల్చింది. తిరిగి జాతీయ జట్టులోకి వస్తానని ఆశపడిన ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ ఆశలు దీంతోనే గల్లంతయ్యాయి.
శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్, అమిత్ సింగ్ స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు బిసిసిఐ వేసిన రవి సవానీ నేతృత్వంలోని కమిటీ తేల్చింది. దోషులకు ఐదేళ్ల నుంచి జీవిత కాలం నిషేధం విధించాలని కమిటీ సూచించింది. శ్రీశాంత్ ఉద్దేశ్యమేమిటో తనకు తెలియదని క్రమశిక్షణా సంఘం ముందు హాజరైన క్రికెటర్ హర్మీత్ సింగ్ అన్నాడు.
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్టయిన శ్రీశాంత్, అంకిత్ చవాన్లకు గతంలో బెయిల్ రాగా, అజిత్ చండిలకు ఇటీవలే బెయిల్ లభించింది. వారు ముగ్గురు కూడా బెయిల్పై బయటే ఉన్నారు.