మోడీ! ప్రజలు నిలదీస్తారు.. సిద్ధంగా ఉండండి, ఓట్ల రూపంలో బుద్ధి చెబుతారు: శివసేన హెచ్చరిక
ముంబై: ప్రజలు వేసే ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధంగా ఉండాలని శివసేన తన మిత్రపక్షం బీజేపీకి సూచించింది. గత కొన్నేళ్లుగా ఈ రెండు పార్టీలు కలిసి పోటి చేస్తున్నాయి. 2014 ఎన్నికల తర్వాత రెండు పార్టీల మధ్య విభేదాలు వచ్చినప్పటికీ.. మిత్రులుగా కొనసాగారు. 2019 లోకసభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయరని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా మళ్లీ ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి.
ఇండియా టీవీ సర్వే: మోడీదే హవా.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు అంటే, తెరాసకు 14, వైసీపీకి 22, టీడీపీకి 3
ఇప్పటికీ అపరిష్కృతంగానే ఆ అంశాలు
అయినప్పటికీ శివసేన.. నరేంద్ర మోడీ పాలనపై ప్రశ్నలు గుప్పిస్తోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలు సంధించబోయే ప్రశ్నలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని బీజేపీకి శివసేన తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. కాశ్మీర్లో శాంతి, అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై ఇచ్చిన హామీలను బీజేపీ నిలబెట్టుకోలేదని పేర్కొంది. 2019లోనూ అవి అపరిష్కృతంగానే ఉండడం విచారకరమని చెప్పింది.
ఓట్ల రూపంలో ప్రజలు ధీటైన సమాధానం చెబుతారు
ఈ మేరకు శివసేన పార్టీ పత్రిక సామ్నాలో రాసింది. మన్ కీ బాత్ రూపంలో తన అభిప్రాయాలను ఇప్పటి వరకు ప్రజలకు విన్నవించిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు ప్రజల మన్ కీ బాత్ వినాల్సి ఉందని పేర్కొంది. ప్రజలను ఎంతో కాలం మోసం చేయలేమని, ఓట్ల రూపంలో వారు దీటైన సమాధానం ఇస్తారని పేర్కొంది.
ఈవీఎంలపై శివసేన
ఈవీఎంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, ఇలాంటి సమయంలో బీజేపీని ఈ అంశంపై ఎందుకు పట్టు వీడటం లేదని ప్రశ్నించింది. చాలా దేశాల్లో ఈవీఎంల వినియోగాన్ని నిలిపివేశారని, ప్రధాని మోడీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతోనే కాలం వెల్లబుచ్చారని పేర్కొంది.