ఢిల్లీ తరహాలో.. జూలో వ్యక్తిపై దాడి చేసి తినేసిన ఎలుగుబంటి
రాయ్పూర్: ఢిల్లీలోని జూలో ఓ యువకుడిని చిరుతపులి చంపేసిన ఘటన మరువక ముందే అలాంటిదే మరో ఘటన వెలుగు చూసింది. చత్తీస్గఢ్లోని సూరజ్పూర్ జూలో సోమవారం ఓ ఎలుగుబంటి యువకుడిని చంపేసింది. జూలో ఉన్న ఎలుగుబంటి ఆ యువకుడిపై హఠాత్తుగా దాడిచేసింది. అందరూ చూస్తుండగానే సజీవంగా అతడ్ని తినేసింది.
కాగా, ఘటన అనంతరం ఆ ఎలుగుబంటిని కాల్చి చంపినట్లు తెలిపారు. ఎలుగుబంటి హఠాత్తుగా దాడి చేయడంతో ఆ వ్యక్తి సహాయం కోసం ఆర్తనాదాలు చేశాడు. దీంతో సమీపంలో ఉన్న వ్యక్తులు ఆ ఎలుగుబంటిపై రాళ్లు మొత్తడం ప్రారంభించారు. అయినా ఆ ఎలుగుబంటి అతడ్ని లాక్కుని వెళ్లి తీవ్రంగా గాయపర్చింది. అతడు ప్రాణాలతో ఉండగానే తినేసింది.
ఆ ఎలుగుబంటి గతంలో కూడా ఇద్దరు వ్యక్తులపై దాడి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఓ రైతును, మరో వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేసినట్లు చెప్పారు. వారిద్దరూ ఎలుగుబంటితో పోరాడేందుకు ప్రయత్నించినా.. ఆ ఎలుగుబంటి వారిని తీవ్రంగా గాయపర్చి చంపేసిందని తెలిపారు.
ఆ ఎలుగుబంటి వ్యక్తులను చంపేసిన తర్వాత కొన్ని భాగాలను తినేసిందని అధికారులు చెప్పారు. తాజా ఘటనతో ముగ్గురి మరణానికి కారణమైన ఆ ఎలుగుబంటిని పోలీసులు కాల్చి చంపారని అధికారులు తెలిపారు.