అయ్యో పాపం.. ఎలుగుబంటిపై దాడి.. పట్టుకోల్పోయి నదిలోకి..! (వీడియో)
ఢిల్లీ : మనుషులు మానవత్వం లేకుండా ప్రవర్తించిన ఘటన కార్గిల్ లో వెలుగుచూసింది. మూగజీవమైన ఎలుగుబంటిపై రాళ్లతో దాడి చేయడం మూలంగా.. అది పట్టు కోల్పోయి నదిలోకి పడిపోయిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ జనావాసాల్లోకి రావడంతో అక్కడి స్థానికులు దాన్ని తరిమే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా రాళ్ల దాడి చేయడంతో కొండపై నుంచి జారుకుంటూ నదిలోకి పడిపోయింది.
తెలుగు రాష్ట్రాల్లో బ్యాడ్ కల్చర్.. పల్లెలకు చేరిన రేవ్ పార్టీలు
కార్గిల్ లో ఓ ప్రాంతంలోని జనావాసాల మధ్యకు వచ్చిన ఎలుగుబంటిని గ్రామస్తులు తరిమే క్రమంలో విషాదం చోటుచేసుకుంది. అది అప్పటికే వారి బారి నుంచి తప్పించుకుని నది ప్రాంతంలోకి చేరింది. అనుకోకుండా కొండ పై నుంచి లోతుగా ఉన్న నదివైపు పరుగులు పెట్టింది. అయితే అక్కడ నీటి ప్రవాహాన్ని గమనించి.. తిరిగి పైకెక్కేందుకు ప్రయత్నించింది.
కొండపైకి ఎక్కే ప్రయత్నంలో భాగంగా.. పైనుంచి అల్లరిమూక రాళ్ల దాడి చేయడంతో అది పట్టు కోల్పోయి నదిలోకి జారి పడిపోయింది. అప్పటికే రాళ్లు బలంగా తాకడంతో తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. ఆ నీటి ప్రవాహానికి ఎలుగుబంటి కొట్టుకుపోయింది. ఈ ఘటనపై మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ విచారం వ్యక్తం చేశారు.
నిందితులను గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కార్గిల్ డిప్యూటీ కమిషనర్ విచారణకు ఆదేశించారు. ఎలుగుబంటిపై దాడి చేసిన అల్లరిమూకను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.