అసలు నిజం దానంతట అదే ఇలా బయటపడటం బాగుంది... 'మొతేరా' వివాదంపై రాహుల్ కామెంట్స్...
గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంకు ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో సర్దార్ పటేల్ స్టేడియంగా పిలవబడ్డ దానికి ఇప్పుడు నరేంద్ర మోదీ స్టేడియంగా నామకరణం చేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా ట్విట్టర్లో దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'అసలు నిజం దానంతట అదే ఇలా బయటపడటం చాలా బాగుంది.. నరేంద్ర మోదీ స్టేడియం... ఆదానీ ఎండ్ రిలయన్స్ ఎండ్... జై షా అధ్యక్షతన..' అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు #HumDoHumareDo హాష్ ట్యాగ్ను జతచేశారు. మొతేరా స్టేడియంకు మోదీ స్టేడియంగా పేరు మార్చడంతో పాటు అందులో రెండు ఎండ్స్కు ఆదానీ,రిలయన్స్ పేర్లు పెట్టడంతో రాహుల్ ఇలా విమర్శలు గుప్పించారు.
గత కొద్దిరోజులుగా రాహుల్ గాంధీ మోదీ-అమిత్ షా ద్వయంతో పాటు ఆదానీ-అంబానీలను టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మోదీ సర్కార్ దేశ సంపదనంతా ఆ ఇద్దరికే దోచి పెడుతోందని... ఆ ఇద్దరి అభివృద్ది కోసమే పనిచేస్తోందని ఆయన విమర్శిస్తున్నారు. మేమిద్దరం మాకిద్దరు సర్కార్(హమ్ దో హమారే దో సర్కార్) అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇటీవల లోక్సభలోనూ అంబానీ,ఆదానీలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
ఇక మొతేరా వివాదంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా ట్విట్టర్లో స్పందించారు. 'ఒకప్పటి దేశ హోంమంత్రి సర్దార్ పటేల్ అప్పట్లో తమ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించాడని బహుశా బీజేపీ వాళ్లకు ఇన్నాళ్లకు గుర్తొచ్చిందేమో. అందుకే స్టేడియం పేరును మార్చేశారు.' అని థరూర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
మరోవైపు కాంగ్రెస్ విమర్శలను బీజేపీ తిప్పికొడుతోంది. సోనియా గాంధీ,రాహుల్ గాంధీ ఇంతవరకూ ప్రపంచంలోనే అతి ఎత్తయిన సర్దార్ పటేల్ విగ్రహాన్ని సందర్శించలేదని... అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఈ విమర్శలు చేసే నైతికత లేదని మండిపడుతోంది.
కాగా,బుధవారం(ఫిబ్రవరి 24) రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అహ్మదాబాద్లో మొతేరా స్టేడియంను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీసీసీఐ కార్యదర్శి జై షా (అమిత్ షా కుమారుడు), కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు. అనారోగ్యం కారణంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఇవాళ మొతేరా వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.