ఆ పోలీస్ అకాడెమీ మెనూలో బీఫ్ తొలగింపు.. చెలరేగిన వివాదం
త్రిస్సూర్: కేరళ పోలీస్ అకాడెమీలో ట్రైనీలకు ఇచ్చే భోజనం మెనూలో బీఫ్ను తొలగించారు. దీంతో కొత్త వివాదం రాజుకుంది. ఇక కేరళలో చాలా ప్రాముఖ్యత పాపులారిటీ ఉన్న డిష్ బీఫ్. కొత్తగా పోలీస్ అకాడెమీలో శిక్షణ తీసుకునేందుకు వచ్చిన పోలీసులకు ఇచ్చిన మెనూలో బీఫ్ను తొలగించారు. అదే సమయంలో అన్ని రకాల నాన్వెజ్ వంటకాలను అందులో పొందుపర్చారు. బీఫ్నే ఎందుకు తొలగించారని కొందరు ప్రశ్నించారు.
ట్రైయినీ పోలీసులకు ఇచ్చిన మెనూలో బీఫ్ను కావాలనే తొలగించారనే విమర్శలు వస్తున్నాయి. అయితే ట్రెయినీస్కు ఇచ్చిన మెనూలో బీఫ్పై నిషేధం విధించలేదని అధికారులు తెలుపుతున్నారు. ఏటా కొత్తగా శిక్షణ పొందేందుకు వచ్చే ట్రైయినీ పోలీసులకు ఇచ్చే మెనూలో మార్పలు చేర్పులు జరుగుతుంటాయని అధికారులు చెప్పారు. ఈ మార్పులు చేర్పులు డైటీషియన్ సూచనల మేరకు జరుగుతాయని స్పష్టం చేశారు. ఆదివారం రోజున విడుదల చేసిన మెనూ ఇందులో భాగమే అని వెల్లడించారు. శిక్షణ తీసుకునేందుకు వచ్చిన ట్రైయినీలకు ఎంత కాలరీలు అవసరం అవుతాయన్నది పరిగణలోకి తీసుకుని మెనూను తయారు చేయడం జరిగిందని చెప్పారు.
ఇదిలా ఉంటే అకాడెమీలో మెస్ చార్జీలను పెంచడం మరో వివాదానికి కారణమైంది. ఇప్పటివరకు రూ.2వేలుగా ఉన్న ఫీజు ఏకంగా రూ.4వేలు పెంచి రూ.6వేలు చేయడం జరిగింది. డైటీషియన్ సూచించినట్లుగా పోలీసులకు అవసరమైన కేలరీలు ఇచ్చే క్రమంలో ఆహార పదార్థాలపై కొంత భారం పడుతున్నందునే చార్జీలు పెంచాల్సి వచ్చిందని సంబంధింత అధికారులు తెలిపారు. బీఫ్ పై ఎలాంటి నిషేధం లేదని చెబుతూనే మెనూలో ఈ పాపులర్ డిష్ను తొలగించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక బీఫ్పై నిషేధం విధించలేదని పోలీస్ హెడ్క్వార్టర్స్ నుంచి అధికారిక ప్రకటన జారీ అయ్యింది.
కేరళ పోలీస్ అకాడెమీలో వారానికి రెండు సార్లు బీఫ్ను సర్వ చేసేవారు. అయితే బీఫ్ పై నిషేధం విధించడం ఇది తొలిసారి కాదు. 2015లో అనధికారిక నిషేధం విధించడం జరిగింది. అప్పటి ఐజీ సురేష్ రాజ్పురోహిత్ ఆదేశాల మేరకు పోలీస్ అకాడెమీలో బీఫ్ను సర్వ్ చేయడం ఆపివేశారు. 2016లో పినరాయి విజయన్ సర్కార్ వచ్చిన తర్వాత ఆ అనధికారిక నిషేధంను ఎత్తివేసింది.