మనోహర్ పారికర్ ఆరోగ్యం మెరుగుపడాలంటే దీన్ని నిషేధించాల్సిందే: స్వామి చక్రపాణి
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యం మెరుగుపడాలంటే తిరిగి ఆయన తొందరగా కోలుకోవాలంటే రాష్ట్రంలో గోమాంసంను నిషేధించాలని అఖిలభారత హిందూ మహాసభ నేత స్వామి చక్రపాణి మహారాజ్ అన్నారు. ఇలా వెంటనే బీఫ్ను గోవాలో నిషేధిస్తే సీఎం మనోహర్ ఆరోగ్యంలో మార్పు కనిపిస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మనోహర్ పారికర్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రంలోకి గోమాంసం దిగుమతిని ఎవరైనా అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని గోమాంసం వ్యాపారులకు తాను అండగా ఉంటున్నట్లు మనోహర్ పారికర్ సంకేతాలు ఇచ్చిన కొద్ది రోజుల్లోనే చక్రపాణి గోమాంసం నిషేధాన్ని మనోహర్ పారికర్ ఆరోగ్యానికి ముడిపెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే స్వామి చక్రపాణి ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలవడం ఇది తొలిసారి కాదు. కేరళలో గోమాంసం ఎక్కువగా సేవిస్తారు కనుకే ఆ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయని గతేడాది కేరళలో తలెత్తిన ప్రకృతి విపత్తు గురించి వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు బీఫ్ తినేవారికి ఎవరూ సహకరించకూడదని.. వారికి పొరుగువారి నుంచి ఎలాంటి సహాయం అందకుండా అలానే చనిపోవాలనే కాంట్రవర్శియల్ స్టేట్మెంట్ కూడా చేశారు. ఇంకెప్పుడూ తాము బీఫ్ను తినమని వరదబాధితులు అఫిడవిట్ సమర్పించాకే వారికి సహాయం అందించాలని స్వామి చక్రపాణి కేరళ వరదల సమయంలో వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే గోవాలో పాలన గాడి తప్పుతోందంటూ త్వరలోనే నాయకత్వంలో మార్పులు రావాల్సి ఉందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు కేంద్రమంత్రి శ్రీపాద్నాయక్. గోవాలో ముఖ్యమంత్రి ఉన్నారా లేదా అన్న అనుమానం కలుగుతోందని చెప్పారు. మూడు నెలల విరామం తర్వాత ఈ మధ్యనే పారికర్ తన నివాసంలో కేబినెట్ భేటీ నిర్వహించారు. పారికర్ ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక గోవాలోని తన ఇంటికే పరిమితం అయ్యారు. అయితే ఈ మధ్య ఓ సారి సచివాలయంలో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.