పుట్ బాల్ వరల్డ్ కప్ మహత్యం: పిజ్జాలు బీర్లు తెగ అమ్ముడుపోతున్నాయట
ఐపీఎల్, ఫుట్ బాల్ వరల్డ్ కప్ పుణ్యమా అంటూ భారత్లో పిజ్జా బీర్ సేల్స్ ఆకాశాన్ని తాకాయి. ఏప్రిల్లో ఐపీఎల్ మ్యాచులతో ప్రారంభమైన పిజ్జా బీర్ల సేల్... తాజాగా జరుగుతున్న పుట్ బాల్ ప్రపంచ కప్ వరకు జోరుగా సాగుతున్నాయి. 2018 ఫిఫా వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారనే విషయం పక్కనబెడితే... డోమినోస్ పిజ్జా, బీర్ల కంపెనీ కింగ్ ఫిషర్లు తెగ లాభాలు చూస్తున్నాయట.
ఈ ఏడాది ఏప్రిల్ వరకు అంటే ఐపీఎల్ ప్రారంభం అయ్యేవరకు సేల్స 19శాతంగా ఉండగా ఐపీఎల్ స్టార్ట్ అవగానే ఒక్కసారిగా మూడురెట్లు సేల్స్ శాతం పెరిగిందని అధికార గణాంకాలు తెలిపాయి. ప్రస్తుతం ఫుట్ బాల్ వరల్డ్ కప్ జరుగుతుండటంతో పిజ్జా, బీర్లను చాలామంది ఆశ్రయిస్తున్నారని పీఆర్బీ సెక్యూరిటీస్ డైరెక్టర్ రాజేంద్ర వాధేర్ చెబుతున్నారు. ఫుట్ బాల్ మ్యాచులు జరిగే సమయంలో రెస్టారెంట్లు యువతతో నిండిపోతున్నాయని అదే సమయంలో పిజ్జా బీర్లు కూడా విపరీత స్థాయిలో అమ్ముడుపోతున్నాయని ఓ సర్వే తెలిపింది.
ఫుట్ బాల్ వరల్డ్ కప్ మ్యాచులు ప్రారంభ దశలోనే ఉన్నాయని ... పోను పోను ఈ సేల్స్ మరింత పెరుగుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏప్రిల్ నుంచి కింగ్ ఫిషర్ బీర్ల కంపెనీ యునైటెడ్ బ్రివరీస్ సంస్థ 25శాతం లాభాలను నమోదు చేసింది. మద్యం మార్కెట్లో దాదాపు 39.2శాతం మార్కెట్ను ఒక్క యునైటెడ్ బ్రివరీస్ సంస్థనే శాసించడం విశేషం.