యాచకుడి ఉదారత: కరోనా ఫండ్కు రూ.లక్ష విరాళం, ప్రశంసించిన కలెక్టర్...
కరోనా వైరస్ సమయంలో చేయూత అందించేందుకు విరాళాలను ప్రభుత్వాలు ఆహ్వానిస్తున్నాయి. ప్రముఖులు రూ.కోట్లలో ఇస్తూ తమ మంచి మనస్సును చాటుకుంటున్నారు. అయితే తమిళనాడులో ఓ యాచకుడు మాత్రం రూ. లక్ష విరాళం అందజేసి తన పెద్ద మనస్సును చాటుకున్నారు. అతని మంచి తనాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. కలెక్టర్ అయితే ఏకంగా ప్రశంసా పత్రాన్ని కూడా ఇచ్చేశాడు.
తమిళనాడులోని మదురైకి చెందిన పుల్ పాండియన్ ఓ బిచ్చగాడు. అందరీ వద్ద యాచిస్తూ డబ్బులు పోగేశాడు. కరోనా వైరస్ వల్ల ప్రభుత్వం విరాళాలను ఆహ్వానిస్తోంది. ఇందుకు పాండియన్ స్పందించాడు. కలెక్టర్ని కలిసి విరాళం అందజేస్తానని తెలిపారు. తనవంతుగా రూ. లక్ష సాయం చేస్తానని ప్రకటించారు. దీంతో కలెక్టర్ సంబరపడిపోయారు.
కరోనా వల్ల పలువురు చనిపోవడం చూసి పాండియన్ చలించిపోయాడు. ఏదైనా మంచి చేయాలని భావించి.. విరాళం ఇస్తున్నాడు. అయితే మే నెలలో రూ.10 వేలు తొలుత అందజేశాడు. తర్వాత ఇటీవల రూ.90 వేలు సేకరించి విరాళం ఇచ్చాడు. మంగళవారం మదురై కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి డబ్బును కరోనా నిధికి విరాళంగా అందజేశాడు. సమాజం పట్ల పాండియన్ బాధ్యతను కలెక్టర్ ప్రశంసించారు. ఆయనను సామాజిక కార్యకర్త అని పేర్కొంటూ ప్రశంస పత్రాన్ని కూడా అందజేశారు. తనకు బిరుదు ఇవ్వడంతో పాండియన్ ఆనందం వ్యక్తం చేశాడు.