పుల్వామా వీరజవాన్లకు బిచ్చగత్తె రూ.6.61 లక్షల విరాళం!, మృతి చెందాక దాతగా..
జైపూర్/అజ్మీర్: పుల్వామా దాడి నేపథ్యంలో అమర జవాన్ల కుటుంబాలకు ఎంతోమంది విరాళాలు ఇస్తున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు.. మొదలు సామాన్యుల వరకు ఎంతోమంది తమకు తోచినంత ఇస్తున్నారు. అయితే రాజస్థాన్లోని అజ్మీర్లో ఓ బిచ్చగత్తెకు చెందిన డబ్బు పుల్వామా అమరవీరులకు విరాళంగా వచ్చింది. ఆ వచ్చిన మొత్తం రూ.6.61 లక్షలు. అయితే అప్పటికే ఆమె చనిపోయింది.
ఆ యాచకురాలి పేరు నందిని శర్మ. ఆమె గుడిమెట్ల వద్ద అడుక్కునేది. గత ఏడాది ఆగస్ట్ నెలలో మృతి చెందింది. కానీ పుల్వామా అమర కుటుంబాలకు ఆరు లక్షలకు పైగా డబ్బు రావడంతో ఆమె దాతగా పేరు తెచ్చుకుంది. నందిని శర్మ గుడిమెట్ల వద్ద అడుక్కుంటూ లక్షలాది రూపాయలు సంపాదించింది. డబ్బుకు నామినీగా ఇద్దరు పేర్లు పేర్కొంది.
అమర జవాన్ల కుటుంబాలకు రూ.6.61 లక్షలు
ఆ నామినీలే ఇప్పుడు ఆ రూ.6.61 లక్షల డబ్బును అమర జవాన్ల కుటుంబాలకు ఇచ్చారు. నందిని శర్మ దాచుకున్న ప్రతి రూపాయి ఇప్పుడు పుల్వామా ఉగ్రదాడిలో వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలకు ఉపయోగపడనుంది. నందిని శర్మ బజరంగఢ్లో ఉండే అంబె మాతా మందిర్ ముందు కూర్చొని భక్తులు ఇచ్చే డబ్బుని తీసుకునేది. ఇలా ప్రతిరోజు వచ్చే డబ్బుని ఆమె బ్యాంకులో జమ చేసింది. అలా ప్రతిరోజు కూడబెట్టిన డబ్బు ఆరు లక్షలు దాటింది.
నందినికి నివాళిగా విరాళం
ఆమె మరణం తర్వాత ఆ డబ్బును ఆమె పేర్కొన్న ఇద్దరికి వచ్చాయి. అయితే ఆమె ద్వారా వచ్చిన డబ్బును ఎవరికైనా.. నందిని శర్మ పేరుపైనే విరాళంగా ఇవ్వాలని వారు భావించారు. పుల్వామా ఘటన నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు ఈ డబ్బుని ఇస్తే, నందిని శర్మకు ఘనంగా నివాళులు అర్పించినట్లు అవుతుందని భావించి, వారు ఆ డబ్బుని వారికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
కలెక్టర్ చేతికి డబ్బు
ఆమె తరఫున వారు అందించిన విరాళం గురించి కలెక్టర్ విశ్వ మోహన్ శర్మ మీడియాతో మాట్లాడారు. వారిద్దరు జిల్లా పరిపాలనావిభాగ కార్యాలయానికి వచ్చి పుల్వామా దాడిలో మృతి చెందిన వీర జవాన్ల కుటుంబాలకు ఆ డబ్బు ఇవ్వాలని కోరారని, ఇందుకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేశామని, ఆ డబ్బు తీసుకుని ఇందుకు సంబంధించిన పత్రాన్ని వారికి అందించామని తెలిపారు.
దేశం కోసం ఉపయోగపడాలని భావించింది
అధికారులకు ఆ డబ్బు ఇచ్చిన వారిలో ఒకరు మాట్లాడుతూ.. ఆమె అన్ని రోజులు యాచకురాలిగా సంపాదించిన డబ్బు దేశం కోసం ఉపయోగపడాలని భావించిందని, అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఈ డబ్బును అందించడమే ఉత్తమంగా తాము భావించామని తెలిపారు. గుడికి వచ్చే భక్తులు నందిని శర్మను గౌరవంగా చూసేవారిని, ఆమెకు బట్టలు, ఆహారం కూడా పెట్టేవారని అంబె మాతా మందిర్ వర్గాలు తెలిపాయి. ఆమె ప్రతిరోజు బ్యాంకుకు వెళ్లి డబ్బు జమ చేసేదన్నారు.