పెరిగిపోతున్న చదువుకున్న భిక్షగాళ్లు: ఎందుకిలా?
గాంధీభవన్: భారత ప్రధాని నరేంద్ర మోడీ గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన గుజరాత్ రాష్ట్రంలో ప్రస్తుతం నిరుద్యోగ సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. ఉన్నత చదువులు చదివినా తమ అర్హతకు తగిన ఉద్యోగాలు దొరకడం లేదని వాపోతున్నారు అక్కడి నిరుద్యోగులు. అయితే, ఏదైనా చిన్న ఉద్యోగం చేయడం కంటే భిక్షమెత్తుకోవడమే మంచిదని వారిలో ఎక్కువ మంది భావిస్తుండటం గమనార్హం.
ఈ నేపథ్యంలోనే గుజరాత్ రాష్ట్రంలోని కొన్ని నగరాల్లో చదువుకున్న భిక్షగాళ్లు పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. భిక్షమెత్తుకోవడమే మేలంటున్న దినేశ్ ఖొడాభాయ్(45) అనే వ్యక్తికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆయన 12వ తరగతి వరకు చదువుకున్నాడు.
గుజరాత్లోని అహ్మదాబాద్లో భద్రకాళి ఆలయం వద్ద భిక్షమెత్తుకుంటున్నాడు. తాను చదివిన చదువుకు కొంతకాలం వార్డ్బాయ్గా పనిచేసినట్లు చెప్పిన దినేశ్.. ఈ మధ్యే భిక్షగాడిగా మారినట్లు తెలిపాడు.
అయితే, వార్డ్బాయ్గా పనిచేసే రోజుల్లో రోజుకు రూ.100 మాత్రమే వచ్చేవని, పూట గడవడం కష్టమవడంతో భిక్షగాడిగా మారానని చెబుతున్నాడు దినేశ్. ఇలా అయితే రోజుకు రూ. 200దాకా సంపాదిస్తున్నానని అంటున్నాడు. కాగా, దినేశ్ లాంటి 75వేల మంది చదువుకున్న వ్యక్తులు ప్రస్తుతం భిక్షగాళ్లుగా ఉన్నారు.
నాన్ వర్కర్స్ బై మెయిన్ ఆక్టివిటీ అండ్ ఎడ్యుకేషన్ లెవల్పై 2011 సెన్సెస్ డేటా ఇటీవల నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. మన దేశంలో 3.72లక్షల మంది భిక్షగాళ్లు ఉండగా.. ఇందులో 75వేల మంది 12వ తరగతి వరకు చదువుకున్నవారు కావడం గమనార్హం.
చదివిన చదువుకు తగిన ఉద్యోగం దొరకక కొందరు, దొరికినా.. ఆ డబ్బుతో ఇంటి అవసరాలు తీరకపోవడంతో చాలా మంది భిక్షగాళ్లుగా మారుతున్నట్లు నివేదిక పేర్కొంది. డిగ్రీలు, పీజీలు పూర్తి చేసినా ఉద్యోగం దొరక్క కొందరు యువకులు భిక్షాటననే ఎంచుకుంటుండటం గమనార్హం.