భారత్లో మరో 2 వారాల్లో పీక్స్... ఆపై కరోనా అంతం ఆరంభం... లేటెస్ట్ రిపోర్ట్...
గడిచిన 24గంటల్లో భారత్లో 69,652 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. గత రెండు వారాలుగా ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారత్లోనే ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలో భారత్కు భారీ ఊరటనిచ్చేలా ఓ ఆసక్తికర రిపోర్ట్ తెర పైకి వచ్చింది. భారత్లో కరోనా వైరస్ అంతం ఆరంభమైందని టైమ్స్ ఫ్యాక్ట్-ఇండియా ఔట్బ్రేక్ 'మోస్ట్ లైక్లీ(దాదాపుగా)' రిపోర్టులో వెల్లడైంది. టైమ్స్ నెట్వర్క్,ప్రొటివిటీ అనే రీసెర్చ్&డేటా సంస్థతో కలిసి ఈ రిపోర్టును తయారుచేసింది.
Recommended Video
మరో 2 వారాల్లో పీక్స్...
ఆ రిపోర్ట్ ప్రకారం... సెప్టెంబర్ 2 నాటికి భారత్లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 7.87 లక్షలకు చేరుతుంది. సెప్టెంబర్ 16 వరకూ కేసుల సంఖ్య నిలకడగా కొనసాగుతుంది. ఆ తర్వాత కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతాయి. మొత్తంగా డిసెంబర్ 3 నాటికి దేశంలో కరోనా వైరస్ అంతమయ్యే అవకాశాలున్నట్లు రిపోర్టులో అంచనా వేశారు. ఓవైపు ప్రపంచ దేశాల కంటే భారత్లోనే ప్రతీ రోజూ ఎక్కువ కేసులు నమోదవుతున్న తరుణంలో టైమ్స్ వెల్లడించిన ఈ అంచనాలు ఎంతమేర నిజమవుతాయన్నది వేచి చూడాల్సిందే.
ఏ రాష్ట్రాల్లో ఎప్పుడు పీక్స్కి...
దేశంలోనే అత్యధిక కేసులతో టాప్లో ఉన్న మహారాష్ట్రలో సెప్టెంబర్ 14 నాటికి కేసుల సంఖ్య పీక్స్కి చేరి 2.23 లక్షల యాక్టివ్ కేసులు నమోదవుతాయని టైమ్స్ రిపోర్ట్ అంచనా వేసింది. కర్ణాటకలో అగస్టు 28 నాటికే యాక్టివ్ కేసుల సంఖ్య పీక్స్కి చేరవచ్చునని పేర్కొంది. ఇక బిహార్,ఉత్తరప్రదేశ్లలో సెప్టెంబర్ 1 నాటికి కేసుల సంఖ్య పీక్స్కి చేరవచ్చునని...ఒడిశాలో సెప్టెంబర్ 14 నాటికి పీక్స్కి చేరే అవకాశం ఉందని తెలిపింది. తమిళనాడు,ఢిల్లీ రాష్ట్రాల్లో జూన్,జులై నెలల్లోనే కేసుల సంఖ్య పీక్స్కి చేరినట్లు రిపోర్ట్ వెల్లడించింది. ఇక ఇదే నెలలో గత వారం రాజస్తాన్,ఆంధ్రప్రదేశ్లలో కరోనా పీక్స్కి చేరినట్లు రిపోర్ట్ అంచనా వేసింది.
హెర్డ్ ఇమ్యూనిటీ....
ఇటీవల ఢిల్లీ,ముంబై,పుణే నగరాల్లో నిర్వహించిన సీరో సర్వేల్లో... ఇప్పటికే ఆ నగరాల్లో పాక్షిక స్థాయిలో 'హెర్డ్ ఇమ్యూనిటీ(మంద స్థాయి రోగ నిరోధకత)' మొదలైనట్లుగా వెల్లడైంది. అయితే దీని శాస్త్రీయతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం... ఈ సర్వేల్లో ప్రజల శరీరాల్లో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీస్ను గుర్తిస్తారు. అవి అప్పటికే కోవిడ్ 19తో పోరాడుతున్నాయా లేదా అన్న దాన్ని సూచిస్తారు. వాటి ఆధారంగా 'హెర్డ్ ఇమ్యూనిటీ',కరోనా మందగమనాన్ని అంచనా వేస్తారు. హెర్డ్ ఇమ్యూనిటీ పెరుగుతున్న సంకేతాలు భారత్లో వైరస్ తగ్గుదలకు సూచనగా చెప్తున్నారు.
అదే జరిగితే... త్వరలోనే బయటపడుతాం...
పుణేలో కరోనా పరిస్థితులపై సీరో చేపట్టిన సర్వే ప్రకారం... సర్వేలో పాల్గొన్న 50శాతం మందిలో కోవిడ్ 19ని ఎదుర్కొనే యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యాయి. ఢిల్లీలో దాదాపుగా 29.1శాతం మందిలో యాంటీ బాడీస్ ఇప్పటికే ఉత్పత్తి అయినట్లు సీరో సర్వే వెల్లడించింది. ఆ లెక్కన ఢిల్లీలో ఇప్పటికే దాదాపు 58లక్షల మంది కరోనా బారినపడ్డట్టు. అంటే,పుణే ఢిల్లీ నగరాల్లో ఇప్పటికే హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసింది. ఇది ఇలాగే కొననసాగి... మిగతా నగరాల్లోనూ హెర్డ్ ఇమ్యూనిటీ పెరిగితే కరోనా వైరస్ నుంచి త్వరలోనే బయటపడవచ్చు. అయితే హెర్డ్ ఇమ్యూనిటీకి సంబంధించిన ప్రాతిపదిక,దాని శాస్త్రీయతను మాత్రం నిర్దారించాల్సిన అవసరం ఉంది.