ప్రారంభం కాబోతున్న రంజాన్ మాసం.. సామూహిక ప్రార్థనల నిషేదం సాధ్యమేనా..?
ఢిల్లి/హైదరాబాద్ : ఓపక్క కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి.. మరోపక్క లాక్ డౌన్ ఆంక్షలు.. దేశ ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇళ్లకే పరిమితమైన సందర్బం. భారతదేశం మొత్తం షట్ డౌన్ గా మారిపొయిన పరిస్థితి. కరోనా మహమ్మారి వ్యాప్తి చెంది ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం అప్రమత్తంగా అడుగులు వేస్తోంది. దేశ ప్రజల మధ్య ఏకాభిప్రాయం తీసుకొచ్చి కరోనాను తరిమికొట్టేందుకు సంసిద్దులను చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. సరిగ్గా ఇలాంటి సమయంలో ముస్లిం సోదరలు అత్యంత భక్తి ప్రపత్తులతో పవిత్రంగా నిర్వహించుకునే రంజాన్ మాసం ప్రారంభం కాబోతున్న అంశం ఆందోళనగా మారింది.
ఐదారు రోజుల్లో రంజాన్ మాసం షురూ.. మార్గదర్శకాలు విడుదల చేసి కేంద్రం..
పవిత్ర రంజాన్ మాసం ఈ సారి కలవరాన్ని మోసుకొస్తోంది. అత్యంత ఉత్సాహంగా, సోదర భావంతో పరమ పవిత్రంగా జరుపుకోవాల్సిన రంజాన్ పర్వదినంపై కరోనా కన్నెర్ర చేయబోతున్నట్టు తెలుస్తోంది. లక్షల మంది ముస్లింలు సామూహిక ప్రార్దనలతో అత్యంత పవిత్రంగా ఈ రంజాన్ పర్వదినాన్ని జరుపుకుంటారు. కాని కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో రంజాన్ మాసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్ గా మారింది. రంజాన్ మాసం సమీపిస్తున్న తరుణంలో సామూహిక నమాజ్లు నిర్వహించొద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది.
రంజాన్ పర్వదినాన్ని ఇళ్లల్లోనే నిర్వహించుకోవాలి.. సామూహిక ప్రార్ధనలు వద్దంటున్న సర్కార్..
అంతే కాకుండా ప్రతీ ఒక్కరు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా వుండాలంటే రంజాన్ ప్రార్థనల్లోను సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు దేశంలోని అన్ని వక్ఫ్ బోర్డులకు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. కరోనా ప్రభావాన్ని, పాజిటీవ్ కేసుల తీవ్రతను, ప్రజారోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ వక్ఫ్ బోర్డులకు వివరించింది. అన్ని రాష్ట్రాల వక్ఫ్ బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించింది కేంద్రం. ఇందులో తీసుకున్న నిర్ణయాలను వెలువరించారు అధికారులు. అందరూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు పాటించాలని స్పష్టం చేస్తున్నారు.
క్లిష్ట సమయంలో పట్టింపులు వద్దు.. ముస్లిం మత పెద్దలకు కేంద్రం విజ్ఞప్తులు..
ఇదిలా ఉండగా మరో ఐదారు రోజుల్లో రంజాన్ మాసం ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రార్థనల కోసం దేశవ్యాప్తంగా మసీదుల్లో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. కరోనా పడగ విప్పి బుసలు కొడుతున్న ప్రస్తుత నేపథ్యంలో ప్రార్థనకు దూరంగా ఉండాలని గాని, లేదా వ్యక్తుల మధ్య దూరాన్ని పాటించాలని వక్ఫ్ బోర్డులకు జారీ చేసిన ఆదేశాలకు ఎంత మంది ముస్లిం సోదరులు కట్టుబడి ఉంటారనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారడమే కాకుండా, ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు చేసుకుంటూ, పర్వదినాన్ని జరుపుకోవాలన్న సూచనలు ఎంతవరకు పాటిస్తారన్నదే సందేహంగా మారుతోంది.
Recommended Video
సంయమనం పాటించాలి.. కరోనాను తరిమి కొట్టాలని ముస్లిం సోదరులుకు కేంద్రం హితవు..
కాగా గత నెల మార్చి 24 తర్వాత దేశంలో సామూహిక ప్రార్థనలు వద్దని, అది కేవలం ముస్లిం మతానికి మాత్రమే కాకుండా హిందూ దేవాలయాలు, క్రిస్టియన్ చర్చిలతోపాటు, సిక్కులు, జైనులు, బుద్దులతో పాటు ఇతర మతాల ప్రార్థనా మందిరాలకు వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. గత 24 రోజులుగా ఇదే తరహా ఆంక్షలు అమలవుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొందరు ఛాందస వాదులు రహస్యంగా బిల్డింగుల మీద, ఇళ్లలో సామూహిక ప్రార్థనలు చేస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టు తెలుస్తోంది. ఇది కేవలం వారి ప్రాణాలకే కాకుండా వారి కుటుంబీకులకు, సన్నిహితులకు ప్రమాదమని చాలా మంది గుర్తించడం లేదు. ఈ నేపథ్యంలోనే త్వరలో రంజాన్ మాసం దేశ ప్రజల్లో ఆందోళన రేపుతోంది.