పెద్దనోట్ల రద్దు అంతా రహస్యమే: ఆ ఆరుగురితోనే మోడీ చర్చ!
పెద్ద నోట్ల రద్దు ప్రకటనపై తాను చాలా కాలంగా రీసెర్చ్ చేశానని, ఎంతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ప్రకటనపై తాను చాలా కాలంగా రీసెర్చ్ చేశానని, ఎంతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఒక వేళ ఈ నిర్ణయం విఫలమైతే.. దీనంతటికీ తనదే బాధ్యత అని పేర్కొన్నారు. ఈ మేరకు మోడీ కేంద్ర మంత్రుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.
అంతా రహస్యమే..
కాగా, తాను అత్యంత నమ్మకంగా ఏరి, కోరి ఎంచుకున్న ప్రభుత్వ అధికారి హస్ముక్ అధియా, మరో ఐదుగురు వ్యక్తులు నోట్ల రద్దు అంశాన్ని పర్యవేక్షిస్తూ.. ఎవరికీ అనుమానం రాకుండా ప్రధాని నివాసంలోని రెండు గదుల్లోనే ఈ పని మొదలు పెట్టినట్టు ఇప్పుడు తెలియవచ్చింది. కాగా, ప్రధాని ప్రకటన వరకూ పెద్ద నోట్ల రద్దు విషయం బయటికి రానివ్వలేదు.
2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచే దీనిపై కసరత్తు చేసినట్లు సమాచారం. ఆరుగురు బృందంతో విస్తృత చర్చలు జరిపిన మోడీ.. మనుగడలో ఉన్న 86శాతం పెద్ద నోట్లు రూ. 500, 1000లను రద్దు చేస్తున్నట్లు నవంబర్ 8న రాత్రి ప్రకటించారు. నల్లకుబేరులు ముందు జాగ్రత్త పడకుండానే ఈ నిర్ణయాన్ని గోప్యంగా ఉంచి, ఆకస్మాత్తుగా ప్రకటించినట్లు తెలుస్తోంది.
లేదంటే నల్లధనం.. బంగారం, ఆస్తులు, ఇతర రూపాల్లోకి మారిపోయేదని వారు భావించారట. ప్రజలకు కొంత ఇబ్బందులు ఎదురైనా.. భవిష్యత్లో ఈ నిర్ణయంతో మేలు జరుగుతుందని విశ్వాసంతోనే ఈ నిర్ణయం ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను తగ్గించేందుకు కొత్త నోట్ల ముద్రణ వేగాన్ని పెంచి పంపిణీ చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. ప్రజల్లోకి కొత్త నోట్లు రావడానికి కొంత సమయం పడుతుందని వారు అప్పటికే అంచనా వేశారు.
ఈ నిర్ణయంపై ఏ ఫలితం వచ్చినా నాదే బాధ్యత అని నరేంద్ర మోడీ పేర్కొన్నట్లు సమాచారం. కాగా, 2014లో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచే సంస్కరణల అమలును వేగవంతం చేసిన మోడీ, నోట్ల రద్దు నిర్ణయం దేశాభివృద్ధిలో అతిపెద్ద మలుపు కాగలదని ముందే భావించారట.
ఇదే విషయాన్ని నవంబర్ 8 నాటి క్యాబినెట్ భేటీలో మోడీ వెల్లడిస్తూ, 'నా రీసెర్చ్ అంతా పూర్తయింది. ఇది విఫలమైతే నన్నొక్కడినే విమర్శించాలి' అని మోడీ వెల్లడించినట్టు ఈ సమావేశంలో పాల్గొన్న ముగ్గురు మంత్రులు పేర్కొన్నారు.
గుజరాత్ సీఎంగా మోడీ విధులు నిర్వహిస్తున్న రోజుల్లో 2003 నుంచి 2006 వరకూ మోడీ వద్ద ప్రధాన కార్యదర్శిగా హస్ముఖ్ విధులు నిర్వహించగా, అప్పటి నుంచే ఆయనపై మోడీ ఎంతో నమ్మకం పెట్టుకున్నారని తెలుస్తోంది. మోడీకి నమ్మకమైన నేతగా నిలిచిన హస్ముక్, అంతకుముందే ఆయనకు యోగాను పరిచయం చేసి మనసుకు కూడా దగ్గరయ్యారట.
ఇక మోడీతో డైరెక్టుగా ఫోన్లో మాట్లాడగలిగే కొద్ది మంది ప్రభుత్వ అధికారుల్లో హస్ముఖ్ కూడా ఒకరు. సెప్టెంబర్ 2015 నుంచి రెవెన్యూ శాఖలో కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న ఆయన, రోజూ అరుణ్ జైట్లీకి రిపోర్టు చేస్తుంటారు. కాగా, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, నల్లధనం భారీ ఎత్తున వెలుగుచూస్తోంది.. ప్రతిపక్ష నేతలు ఆందోళన చేస్తున్నారు.