ఉద్ధవ్ థాక్రే కేబినెట్లో లుకలుకలు: మంత్రి పదవికి రాజీనామా చేసిన సత్తార్..?
మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు కూడా కాక ముందే అప్పుడే రాజీనామాలు మొదలైనట్లు సమాచారం. రాజీనామా చేసింది ఎవరో కాదు.. థాక్రే కేబినెట్లోని మంత్రి. మహారాష్ట్ర వికాస్ అగాడీ ప్రభుత్వంలో శివసేన పార్టీకి చెందిన మంత్రి అబ్దుల్ సత్తార్ తన పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కేబినెట్ ర్యాంకును తాను ఆశించి సహాయశాఖ మంత్రి ఇవ్వడంతో అసంతృప్తితో అబ్దుల్ సత్తార్ ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
సీఏఏను మహారాష్ట్రలో అమలు చేసేదే లేదు: సీఎం ఉద్ధవ్, మంత్రి బాలా సాహెబ్
ఔరంగాబాద్ జిల్లాలోని సిల్లాద్ నుంచి సత్తార్ శివసేన తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకుముందు కాంగ్రెస్లో ఉన్న సత్తార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు శివసేన పార్టీలోకి మారారు. కేబినెట్ బెర్తు ఇవ్వకుండా సహాయమంత్రికే అబ్దుల్ సత్తార్ను పరిమితం చేయడంపై అసంతృప్తితో ఉన్నట్లు శివసేన వర్గాలు చెప్పాయి. అయితే సత్తార్ రాజీనామాపై వచ్చిన వార్తలపై ఇటు ముఖ్యమంత్రి కార్యాలయం కానీ, అటు రాజ్భవన్ వర్గాలు కానీ ధృవీకరించలేదు. అంతేకాదు సత్తార్ కూడా దీనిపై మాట్లాడకపోవడం విశేషం.
ఇదిలా ఉంటే సత్తార్ రాజీనామా చేశారా లేదా అనేదానిపై శివసేన నాయకులు ధృవీకరించనప్పటికీ ఆయన్ను బుజ్జగించే ప్రయత్నాలు మాత్రం చేస్తున్నట్లు సమాచారం. అయితే శివసేన సీనియర్ నేత అనిల్ దేశాయ్ మాత్రం సత్తార్ రాజీనామా చేయలేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే అబ్దుల్ సత్తార్ను కలిసి మాట్లాడాల్సిందిగా పార్టీనేత అర్జున్ ఖోత్కర్ను పంపడం జరిగింది. ఔరంగాబాద్లోని ఓ హోటల్లో సత్తార్ను కలిసిన అర్జున్ ఖోత్కర్ తిరిగి వెళుతూ మాట్లాడేందుకు నిరాకరించారు. మరోవైపు తన తండ్రి రాజీనామాపై తనకేమీ తెలియదని అటువంటిది ఏమైనా ఉంటే తానే మాట్లాడాల్సి ఉంటుందని సత్తార్ కొడుకు సమీర్ చెప్పారు.
ఒకప్పుడు కాంగ్రెస్ - ఎన్సీపీలు కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో సత్తార్కు కేబినెట్ బెర్త్ పదవి దక్కింది.ఇదిలా ఉంటే శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే పార్టీలోని సీనియర్లను కాదని కేబినెట్లోకి ఇద్దరు జూనియర్ మంత్రులను తీసుకోవడంపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్లో ఉద్ధవ్ థాక్రే ఒక కేబినెట్ పోస్టు మరో రెండు సహాయమంత్రి పదవులను తనకు మద్దతుగా నిలిచిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలకు కట్టబెట్టారు.