దేశభద్రతపైనా రాజకీయాలేనా: ఎన్డీటీవీ బ్యాన్పై వెంకయ్య ఫైర్
చెన్నై: ఎన్డీటీవీ ప్రసారాల నిలిపివేత అంశంపై వస్తున్న విమర్శలపై కేంద్ర సమాచార, బ్రాడ్ కాస్టింగ్ మంత్రి వెంకయ్యనాయుడు తీవ్రంగా స్పందించారు.
దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాల్లో కఠినంగా ఉన్నామని, ప్రసార నిబంధనలను ఉల్లంఘించినందుకే ఎన్డీటీవీ ఛానల్పై నిషేధం విధించినట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు.
ఇలాంటి భద్రత విషయంలోనూ రాజకీయ విమర్శలు చేయడం అర్థరహితమని అన్నారు. ఛానల్పై నిషేధం విధించడానికి ఎటువంటి కొత్త చట్టాలను తయారు చేయలేదని, కేంద్ర ప్రసార శాఖ నిబంధనల ప్రకారమే నిలిపివేసినట్లు వెంకయ్య పేర్కొన్నారు. 2005 నుంచి 2014 వరకు యూపీఏ పాలనలో మొత్తం 21సార్లు పలు టీవీ ఛానెళ్లపై నిషేధం విధించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
పఠాన్కోట్ దాడి సందర్భంగా ఆ ఛానెల్ ప్రసారం చేసిన విజువల్స్ వల్ల సైనికులు, పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉండేదన్నారు. దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో రాజకీయాలు పనికిరాదని హితవు పలికారు.