కాంగ్రెస్ వర్గ రాజకీయాలు: లక్ష్మీ హెబ్బాళ్కర్ ఔట్, జారకిహోళి బ్రదర్స్ దెబ్బ, పుష్పాకు చాన్స్!
బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలోని వర్గ రాజకీయాలకు బ్రేక్ వేసి ప్రభుత్వం కుప్పకూలిపోకుండా నాయకులు చర్యలు తీసుకుంటున్నారు.
కొంత కాలంగా బెళగావిలోని కాంగ్రెస్ పార్టీ వర్గ పోరు తారాస్థాయికి చేరింది. బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి మంత్రి రమేష్ జారకిహోళి, ఆయన సోదరుడు సతీష్ జారకిహోళి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం ముమ్మరంగా సాగింది.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, కేపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మీ హెబ్బాళ్కర్, మంత్రి రమేష్ జారకిహోళి సోదరుల మధ్య విభేదాలే అందుకు కారణం అని బహిరంగంగా వెలుగు చూసింది. ఈ నేపధ్యంలో బెళగావి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మీద పట్టుకు జారకిహోళి సోదరులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
కేపీసీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలి పదవి నుంచి లక్ష్మి హెబ్బాళ్కర్ ను తప్పించారు. లక్ష్మి హెబ్బాళ్కర్ స్థానంలో కేపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పుష్పా అమరనాథ్ ను నియమించారు. మైసూరు ప్రాంతానికి చెందిన పుష్పా అమరనాథ్ జిల్లా పంచాయితీ అధ్యక్షురాలిగా పని చేస్తున్నారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు అత్యంత సన్నిహితురాలిగా పుష్పా అమరనాథ్ గుర్తింపు తెచ్చుకున్నారు. కేపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పుష్పా అమరనాథ్ తో పాటు నలుగురు పోటీ పడ్డారు. అయితే చివరి నిమిషంలో లక్ష్మి హెబ్బాళ్కర్ స్థానాన్ని పుష్పా అమరనాథ్ కైవసం చేసుకున్నారు.