కాంగ్రెస్ కు షాక్: మరో వికెట్ పథనం, బళ్లారి జిల్లా ఎమ్మెల్యే రాజీనామా, క్యూలో 7 మంది రెబల్స్ !
బెంగళూరు: ఆషాడమాసం మొదలైన సందర్బంగా కర్ణాటక ప్రభుత్వానికి మాజీ మంత్రి, బళ్లారి జిల్లా విజయనగర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ తన పదవికి రాజీనామా చేసి అందరికీ ఊహించని షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆనంద్ సింగ్ బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆనంద్ సింగ్ తన రాజీనామా పత్రాన్ని కర్ణాటక శాసన సభ స్పీకర్ రమేష్ కుమార్ కు అందించారని ఆయన వర్గీయులు అంటున్నారు.
ఢిల్లీలో కేంద్ర మంత్రి !
ఆదివారం ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాధ్ సింగ్ తో ఆనంద్ సింగ్ భేటీ అయ్యారు. తరువాత ఆనంద్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ రాజీనామాతో కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అయోమయంలో పడిపోయింది.
సీఎం విదేశీ పర్యటన
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అమెరికా వెళ్లారు. సీఎం కుమారస్వామి విదేశీ పర్యటనకు బయలుదేరివెళ్లిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ రాజీనామా చెయ్యడంతో సంకీర్ణ ప్రభుత్వంలో మరో వికెట్ పడిపోయింది. ఆనంద్ సింగ్ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందు జాగ్రత్తగా అలర్ట్ అయ్యారు.
రెబల్ ఎమ్మెల్యేలు
కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వంలో అసంతృప్తి ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరు బయటకు రావడానికి రంగం సిద్దం అయ్యిందని వెలుగుచూసింది మొదటి నుంచి సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన గోకాక్ ఎమ్మెల్యే (కాంగ్రెస్), మాజీ మంత్రి రమేష్ జారకిహోళి నేతృత్వంలోని అసమ్మతి ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యడానికి సిద్దం అయ్యారని తెలిసింది.
మూడు గ్రూప్ లు ?
మూడు గ్రాప్ లుగా సంకీర్ణ ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారని సమాచారం. రమేష్ జారకిహోళి మద్దతుదారులుగా గుర్తింపు తెచ్చుకున్న కంప్లీ ఎమ్మెల్యే గణేష్, హీరేకరూరు ఎమ్మెల్యే బిసి, పాటిల్, బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్ర, అథణి ఎమ్మెల్యే మహేష్ కుమటళ్ళి తమ పదవులకు రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
జాదెవ్ దెబ్బతో !
కొంత కాలం క్రితం కాంగ్రెస్ పార్టీకి చెందిన డాక్టర్ ఉమేష్ జాదవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యడంతో సంకీర్ణ ప్రభుత్వంలో అసమ్మతి బగ్గుమంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన డాక్టర్ ఉమేష్ జాదెవ్ తరువాత లోక్ సభ ఎన్నికల్లో ఓటమి ఎరుగని రారాజు మల్లికార్జున్ ఖార్గేని ఓడించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఉమేష్ జాదెవ్ దారిలోనే కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు బయలుదేరారు.
దళపతికి షాక్ ?
కాంగ్రెస్ పార్టీ అసమ్మతి ఎమ్మెల్యేలతో పాటు జేడీఎస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశం ఉందని వెలుగు చూడటంతో మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ దళపతి హెచ్.డి. దేవేగౌడతో పాటు ఆయన వర్గీయులు షాక్ కు గురైనారని సమాచారం. ఇప్పటికే జేడీఎస్ పార్టీ కర్ణాటక శాఖ అధ్యక్ష పదవికి హెచ్. విశ్వనాథ్ రాజీనామా చేసి దళపతికి షాక్ ఇచ్చారు. ఇప్పుడు అదే దారిలో కేఆర్ పేట్ ఎమ్మెల్యే నారాయణగౌడ, హిరియపట్టణ ఎమ్మెల్యే మహదేవు, టీ. నరశీపుర ఎమ్మెల్యే అశ్విన్ కుమార్ వారి పదవులకు రాజీనామా చేస్తారని తెలిసింది.
రంగంలోకి బీజేపీ లీడర్స్
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ రాజీనామాతో బీజేపీ నాయకులు రంగంలోకి దిగారు. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప ఆ పార్టీ నాయకులతో బెంగళూరులో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తున్నారు. సోమవారం మా నాయకుడు బీఎస్. యడ్యూరప్ప విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యచరణ గురించి వివరిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ రాజీనామాతో కర్ణాటకలో మళ్లీ బీజేపీ అధికారం చేపట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.