గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం డీల్, ఎన్నికల్లో దెబ్బ, రూ. 160 కోట్లు (వైరల్ వీడియో)
బెంగళూరు: ఓబుళాపురం మైనింగ్ కంపెనీని రక్షించుకోవడానికి, గాలి జనార్దన్ రెడ్డి సోదరులకు బెయిల్ మంజూరు చేయించడానికి బళ్లారి బీజేపీ ఎంపీ బి. శ్రీరాములు అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కుటుంబ సభ్యులతో భారీ డీల్ కుదుర్చుకున్నారని ఆరోపిస్తూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు రెండు రోజుల ముందు బళ్లారి శ్రీరాములు ఉన్న ఓ వీడియో విడుదల కావడంతో బీజేపీ నాయకులు ఉలిక్కిపడ్డారు.
సుప్రీం కోర్టు తీర్పు
అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బాలకృష్ణన్ రిటైడ్ కాకముందు గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అనుకూలంగా తీర్పు చెప్పారు. ఆ వీడియో మే 10వ తేదీ గురువారం బయటకు రావడంతో బీజేపీని విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతికి మంచి అస్త్రం చిక్కింది.
బీజేపీకి నైతిక హక్కు లేదు
బెంగళూరులో గురువారం కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి దినేష్ గుండూరావ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బి. శ్రీరాములు కోర్టు వ్యవహారంలో చేసిన డీల్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోందని, అలాంటి వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీకి మా గురించి మాట్లాడే నైతిక హక్కులేదని విమర్శించారు.
ఆంధ్రా ప్రభుత్వం
ఓబుళాపురం మైనింగ్ కంపెనీని నిలిపివేస్తూ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
ఒక్క రోజు ముందు తీర్పు
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ వ్యవహారం కేసును అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బాలకృష్ణన్ రిటైడ్ అయ్యే ఒక్క రోజు ముందు గాలి జనార్దన్ రెడ్డికి అనుకూలంగా తీర్పు చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డికి అనుకూలంగా తీర్పు రావడానికి పెద్ద డీల్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
మంత్రి పదవిలో శ్రీరాములు... అవాస్తవాలు నమ్మొద్దని బీజేపీ
గాలి జనార్దన్ రెడ్డి సోదరులకు బెయిల్, ఓబుళాపురం కంపెనీ వ్యవహారంలో జరిగిన డీల్ అంటు విడుదలైన వీడియో అప్పట్లో కర్ణాటక మంత్రిగా ఉన్న బి. శ్రీరాములు, అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బాలకృష్ణన్ అల్లుడు శ్రీనిజన్, స్వామీజీ, మధ్యవర్తి కుబాళన్ చర్చించుకుంటున్న ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తీర్పు చెప్పడానికి రూ. 160 కోట్ల డీల్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి.కాగా, ఇలాంటి ఫేక్ స్టింగ్ వీడియో చాలా వస్తూనే ఉంటాయి, వీటిని నమ్మాల్సిన అవసరం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. కాంగ్రెస్ చేస్తున్న అవాస్తవాలను నమ్మాల్సిన అవసరం లేదని అన్నారు.