డ్రైవర్ ఆత్మహత్యతో గాలికి ఉచ్చు: కూతురు పెళ్లి కోసం రూ.100 కోట్ల మార్పిడి
కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి రూ.100 కోట్ల ధనాన్ని వైట్గా మార్చుకొని తన కూతురు పెళ్లి చేశాడనే ఆరోపణలు వస్తున్నాయి.
బళ్లారి: మైనింగ్ కింగ్, మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తన కూతురు పెళ్లిని అంగరంగా వైభవంగా చేసి పతాక శీర్షికలకు ఎక్కారు. తన కూతురు పెళ్లికి ఆయన రూ.500 కోట్లు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోందని వార్తలు కూడా వచ్చాయి. అందుకు ఆహ్వాన పత్రిక డిజిటల్గా ఉండటం కూడా కారణం.
మరో ఆసక్తికర విషయం ఏమంటే, నోట్ల రద్దు తర్వాత గాలి తన కూతురు పెళ్లి చేశాడు. రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేశాక పెద్ద మొత్తం ఖర్చు చేసి గాలి తన కూతురు పెళ్లి ఎలా చేశాడన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే, దీనికి సమాధానం దొరికే లోపే ఆయన మెడకు ఉచ్చు బిగిసింది.
గాలి మధ్యవర్తుల సాయంతో పాతనోట్లు మార్చినట్లుగా తేలిందని సమాచారం. మీడియాలో వస్తున్న వార్తల మేరకు.. నోట్ల మార్పిడి సమయంలో కొంత నగదు తక్కువగా వచ్చిందని ఈ నోట్ల మార్పిడికి సహకరించిన అధికారి డ్రైవర్కు గాలి అనుచరుల నుంచి బెదిరింపులు వచ్చాయంటున్నారు.
దీంతో మనస్తాపంతో డ్రైవర్ రమేష్ గౌడ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే రమేష్ గౌడ రాసిన సూసైడ్ నోట్తో గాలి జనార్ధన్ బాగోతం వెలుగులోకి వచ్చింది. బళ్లారిలో 20శాతం కమీషన్తో 100 కోట్ల పాతనోట్లు మార్పిడి చేసినట్లు ఈ లేఖ ద్వారా తెలుస్తోంది.
రమేష్ గౌడ మద్దురులో విషం తాగి మృతి చెందాడు. ఇతను రెవెన్యూ ఆఫీసర్ భీమా డ్రైవర్గా పని చేశాడు. ఆత్మహత్య చేసుకున్న రమేష్ గౌడ తన సూసైడ్ నోట్లో.. గాలి తన రూ.100 బ్లాక్ మనీనీ వైట్గా మార్చుకున్నట్లు పేర్కొన్నాడు. ఇందుకు రెవెన్యూ ఆఫీసర్ ఇరవై శాతం కమిషన్ తీసుకున్నాడని పేర్కొన్నాడు.
గాలి జనార్ధన్ రెడ్డి, ఆయన అనుచరుడు, ఎంపి శ్రీరాములు.. వీరిద్దరు అధికారిను పలుమార్లు కలిసినట్లు పేర్కొన్నాడు. కూతురు పెళ్లికి ముందు బెంగళూరులోని ఫైవ్ స్టార్ హోటల్లో కలిసినట్లు చెప్పాడు.
మరో ఆసక్తికర విషయం ఏమంటే ఇలా సాయం చేస్తున్నందుకు కమిషన్తో పాటు 2018 ఎన్నికల్లో కర్నాటక ఎన్నికల్లో టిక్కెట్ ఇప్పించడంలో సాయం కూడా అడిగాడని తెలుస్తోంది. కాగా, పోలీసులు ఆఫీసర్ భీమా, మరో డ్రైవర్ పైన కేసు నమోదు చేశారు. కాగా, పెళ్లి విషయమై ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించి, ఆ తర్వాత గాలిని విచారించిన విషయం తెలిసిందే.