కాంగ్రెస్ VSకాంగ్రెస్, వేడెక్కిన రాజకీయం, బళ్లారి శ్రీరాములు ఎంట్రీ, ఢిల్లీకి మాజీ సీఎం!
బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు శుక్రవారం ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ లోని రెండు వర్గాల గొడవ జరగడం, మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప ఢిల్లీ బయలుదేరడం, బళ్లారి శ్రీరాములు ఎంట్రీ ఇచ్చి కర్ణాటక మంత్రితో సహ ఆయన సోదరుడితో చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరగడంతో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.
బెళగావిలో పీఎల్ డీ బ్యాంకు అధ్యక్ష పదవితో పాటు పదాధికారుల ఎన్నికలు శుక్రవారం జరిగాయి. కర్ణాటక మంత్రి రమేష్ జారకిహోళి, ఆయన సోదరుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే సతీష్ జారకిహోళి వర్గీయులు పీఎల్ డీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని ముందుగానే నిర్ణయించారు.
లేడీ ఎమ్మెల్యే పోటీ
కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాలు, ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ వర్గీయులు పోటీలో ఉన్నారు. విషయం తెలుసుకున్న కేపీసీసీ ఉపాధ్యక్షుడు ఈశ్వర్ ఖండ్రే రెండు వర్గాలను రాజీ చేశారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో లక్ష్మీ హెబ్బాళ్కర్ వర్గానికి చెందిన వారే పీఎల్ డీ బ్యాంకు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులతో పాటు అన్ని పదవుల్లో విజయం సాధించారు.
కాంగ్రెస్Vsకాంగ్రెస్ !
లక్ష్మీ హెబ్బాళ్కర్ తీరుపై మంత్రి రమేష్ జారకిహోళి, ఆయన సోదరుడు సతీష్ జారకిహోళి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంలో జారకిహోళి సోదరులతో సన్నిహిత సంబంధాలు ఉన్న బళ్లారి శ్రీరాములు రంగంలోకి దిగారు.
కాంగ్రెస్ కు చెక్ !
జారకిహోళి సోదరులతో మంతనాలు జరపడానికి బళ్లారి శ్రీరాములు సిద్దం అయ్యారని తెలిసింది. లక్ష్మీ హెబ్బళ్కార్ విషయం ముందు పెట్టుకుని అసమ్మతితో ఉన్న జారకిహోళి సోదరులను కాంగ్రెస్ పార్టీకి దూరం చెయ్యాలని ప్రయత్నాలు మొదలైనాయని సమాచారం.
16 మంది జంప్ !
జారకిహోళి సోదరులతో సహ 16 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుని అక్టోబర్ లో కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని తెలిసింది. గత నెలలో మంత్రి రమేష్ జారకిహోళి ఢిల్లీలో బీఎస్. యడ్యూరప్పతో సుదీర్ఘంగా చర్చలు జరిపారని వార్తలు వచ్చాయి.
చలో ఢిల్లీ, అమిత్ షా !
శుక్రవారం మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప ఢిల్లీ బయలుదేరారు. బళ్లారి శ్రీరాములు సైతం ఢిల్లీ వెలుతున్నారు. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో, జారకిహోళి సోదరులు బీజేపీలోకి వస్తే ఉత్తర కర్ణాటకలో పార్టీకి జరిగే మేలు గురించి అమిత్ షాకు వివరించి ఓ నిర్ణయం తీసుంటారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.