బినామీ లావాదేవీల(నిషేధం) చట్టం: అమలులోకి వచ్చిన వారానికి 'నోట్ల రద్దు'
ప్రధాని మోడీ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయానికి సరిగ్గా వారం రోజుల ముందు.. అంటే నవంబర్ 1న బినామీ లావాదేవీల సవరణ (నిషేధం) చట్టం అమలులోకి రావడం గమనార్హం.
న్యూఢిల్లీ : నోట్ల రద్దు ఎఫెక్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయానికి సరిగ్గా వారం రోజుల ముందు.. అంటే నవంబర్ 1న బినామీ లావాదేవీల సవరణ (నిషేధం) చట్టం అమలులోకి రావడం గమనార్హం. దేశంలో నల్లధనాన్ని అరికట్టాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనల్లో భాగంగా ఈ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చారు.
కొత్త చట్టం ఏం చెబుతోంది?
బినామీ లావాదేవీల(నిషేధం) సవరణ బిల్లు 2015లో లోక్సభలో ఆమోదం పొందింది. బినామీ లావాదేవీల(నిషేధం) చట్టం-1988 స్థానంలో ఈ కొత్త బిల్లును తీసుకొచ్చింది కేంద్రం. ఈ బిల్లు ద్వారా బినామీ ఆస్తులను జప్తు చేయడం, బినామీ కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవడం వంటి చర్యలు కేంద్రం చేపట్టనుంది. ఇదివరకటి చట్టంలో 9 సెక్షన్లు మాత్రమే ఉండగా, సవరించిన చట్టంలో 71 సెక్షన్లుంటాయి.
నిజాయితీగా వ్యవహరించే మతపరమైన ధార్మిక సంస్థలకు దీని నుంచి మినహాయింపు ఉంటుందని అప్పట్లో హామి ఇచ్చారు. అయితే ధార్మిక సంస్థల ముసుగులో అక్రమాలకు తెరలేపితే మాత్రం ఊరుకోనేది లేదని కేంద్రం హెచ్చరించింది. కొత్త చట్టం ప్రకారం ఆస్తులకు సంబంధించిన లావాదేవీలన్ని ఆధార్ కార్డు మరియు పాన్ కార్డుతో ముడిపడనున్నాయి.
బినామి ఆస్తులు అంటే?
పన్ను కట్టని అక్రమ సంపాదన, అవినీతి డబ్బుతో ఇతరుల పేరిట ఆస్తులను కొనడం వంటి వాటిని బినామీలుగా పరిగణిస్తారు. దాదాపుగా 200ఏళ్ల నుంచి బినామీ లావాదేవీలు జరుగుతూ వస్తున్నాయి. జమీందారీ వ్యవస్థ రద్దయిన తర్వాత బినామీ లావాదేవీలు తెరపైకి వచ్చాయి. పన్నుల నుంచి తప్పించుకోవడానికి చాలామంది ఈ విధానాన్ని అనుసరిస్తూ వస్తున్నారు.
బినామీ ఆస్తులను ఏంచేస్తారు?
బినామీ అని తేలిన తర్వాత ఎలాంటి పరిహారం చెల్లించకుండానే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. దీనిపై అసలు యజమానుదారికి కూడా మాట్లాడే అర్హత ఉండదు.బినామీ పేరిట (మరొకరి పేరిట) ఆస్తులు కొన్నట్లు రుజువైతే ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష పడుతుంది. మార్కెట్ లో సదరు బినామీ ఆస్తులకు ఉన్న రేటును బట్టి 25శాతం వరకు జరిమానా విధించే అవకాశం కూడా ఉంటుంది.
బినామీ లావాదేవీ గురించి తెలిసీ ఇతరులకు తప్పుడు సమాచారమిచ్చిన వారికి ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకు కారాగార శిక్ష, ఆస్తి విలువలో పదిశాతం జరిమానా విధించే అవకాశాలున్నాయి
బినామీ ఆస్తులను అమ్ముకోవడం కుదరని పని!
ఎలాగోలా బినామీని ఆస్తులను మరొకరికి అంటగట్టి సొమ్ము చేసుకుందామన్న ఇప్పటి పరిస్థితుల్లో అది కుదరని పని. కొత్త నోట్ల మార్కెట్లో ఎక్కువగా లేని నేపథ్యంలో.. అంత డబ్బు ముట్టిజెప్పి ఎవరు బినామీ ఆస్తులను కొనుగోలు చేయరు. ఒకవేళ చెక్కు ద్వారా చెల్లింపులు జరపాలంటే.. కొనే వ్యక్తి సంపాదన సక్రమ మార్గంలో ఉండుండాలి. అంటే, దానికి ఆదాయపన్ను చెల్లించి ఉండాలి.