ఇది మమత బెంగాల్ లెక్క: కరోనా మరణాలు ఎక్కువ.. చూపేది తక్కువ!
కోల్కతా: పశ్చిమబెంగాల్ ప్రభుత్వంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న కరోనా మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర సర్కారు తొలిసారి కరోనా మరణాల సంఖ్యను శుక్రవారం వెల్లడించింది. కరోనాతో 57 మంది మృతి చెందారని తెలిపింది.
అంతేగాక, రెండు లేదా అంతకన్నా ఎక్కువ వ్యాధులుండి కరోనావైరస్ తో చనిపోయిన వారి సంఖ్య 39గా ఉందని పేర్కొంది. అయితే, వీటిని కరోనా లెక్కల్లోకి తీసుకోలేదని చెప్పడం గమనార్హం. కాగా, రాష్ట్రంలో 18 మంది కరోనాతో మరణించారని బెంగాల్ ఆడిట్ కమిటీ తెలిపింది. కరోనా మరణాల గురించి కేంద్రం పంపించిన బృందాలు ప్రశ్నించడంతో ఆడిట్ కమిటీ ఈ మేరకు వివరాలను వెల్లడించింది.
ఐసీఎంఆర్ మార్గదర్శకాలను అనుసరించే మరణాలను ధృవీకరిస్తున్నారా? అని కేంద్ర బృందం వారిని ప్రశ్నించింది. కాగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ సిన్హాకు అపూర్వ చంద్ర నేతృత్వంలోని కేంద్ర బృందం లేఖ రాసింది. కరోనా మరణాన్ని ధృవీకరించేందుకు కమిటీ ఎంత సమయం, ఏయే అంశాలను పరిగణలోకి తీసుకుంటోందని కేంద్ర బృందం ప్రశ్నించింది.
Recommended Video
అంతేగాక, ఒకవేళ కరోనా రోగి రహదారి ప్రమాదంలో చనిపోతే దానిని కరోనా మరణంగా పరిగణించలేం కదా అని బెంగాల్ వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పిన వింత తర్కాన్ని గురించి కూడా ఆ లేఖలో కేంద్రం ప్రస్తావించింది. ఆయన జవాబు సంతృప్తికరంగా లేదని స్పష్టం చేసింది. మరణాలను ధృవీకరించేందుకు కమిటీని కలిసి ఈ మెథడాలజీని అర్థం చేసుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవల కేంద్ర బృందం బెంగాల్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు మొదట సహకరించమని చెప్పిన సీఎం మమతా బెనర్జీ.. ఆ తర్వాత వెనక్కి తగ్గి కలిసి పనిచేసేందుకు తమకు అభ్యంతరం లేదని తెలిపిన విషయం తెలిసిందే.