నెం. 4: సీఏఏ వ్యతిరేక తీర్మానానికి పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఆమోదం
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తాను చెప్పినట్లే చేశారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ తీసుకొచ్చిన తీర్మానాన్ని పశ్చిమబెంగాల్ అసెంబ్లీ సోమవారం ఆమోదం తెలిపింది. దీంతో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన నాలుగో రాష్ట్రంగా పశ్చిమబెంగాల్ నిలిచింది.
అసెంబ్లీలోఈ తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ దేశ ప్రజలను విడదీసేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. సీఏఏకు వ్యతిరేకంగా తాను ఒంటరిగానైనా పోరాటం చేస్తానని అన్నారు. జనవరి 27న తమ రాష్ట్ర అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని గతంలోనే మమతా బెనర్జీ ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా, సోమవారం పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మంత్రి పార్థ ఛటర్జీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సీఏఏ కారణంగా దేశమంతా ఆందోళనకర వాతావరణం నెలకొందని ఈ సందర్భంగా సీఏం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.
దేశాన్ని, ప్రజలను విభజించేందుకు తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ఎంతమాత్రం సమర్థించేది లేదని మమతా అన్నారు. బెంగాల్లో సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసేది లేదని తేల్చి చెప్పారు. వీటి వల్ల ప్రజలు తమ దేశం విడిచి వెళ్లాల్సి వస్తుందేమోనని ప్రజలు భయపడుతున్నారని అన్నారు. సీఏఏను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
సీఏఏను తీసుకొచ్చిన నాటి నుంచి మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. కాగా, సీఏఏను వ్యతిరేకిస్తూ ఇప్పటికే కేరళ, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మానాలు చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు తాము ఈ చట్టాన్ని అమలు చేయబోమని చెబుతుతున్నాయి.
కాగా, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనేది పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో మతపరమైన వేధింపులు, వివక్షను ఎదుర్కొని అక్కడ బతకలేని స్థితిలో మనదేశానికి శరణార్థులుగా వచ్చిన మైనార్టీల(హిందువులు, సిక్కులు, జైనులు, క్రిస్ట్రియన్లు, ఇతర మైనార్టీలు)కు భారత పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే, సీఏఏకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎవరు వ్యతిరేకించినా దేశంలో సీఏఏను అమలు చేసి తీరుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు.