బీజేపీ నేత దారుణ హత్య... 12గంటల బంద్కు పిలుపు... మూల్యం తప్పదని హెచ్చరించిన ఎంపీ...
పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత,ఎంపీ అర్జున్ సింగ్ సన్నిహితుడు,టిటాగర్ మునిసిపాలిటీ కౌన్సిలర్ మనీష్ శుక్లా దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిపి హతమార్చారు. శుక్లా హత్యపై భగ్గుమన్న బీజేపీ సోమవారం(అక్టోబర్ 5) 12గంటల బంద్కు పిలుపునిచ్చింది. ఘటనపై ట్విట్టర్లో స్పందించిన రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంకార్.. స్టేట్ హోం సెక్రటరీ,డీజీపీలను సోమవారం ఉదయం 10గంటలకు రాజ్భవన్ రావాల్సిందిగా ఆదేశించారు.
ఆడపిల్లకు బుద్ధి నేర్పితేనే అత్యాచారాలు తగ్గుతాయి, ప్రభుత్వ చర్యలతోకాదు: బీజేపీ ఎమ్మెల్యే
రాత్రి 8.30గం. సమయంలో...
బరాక్పూర్లో జరిగిన ఓ సమావేశం అనంతరం ఆదివారం రాత్రి 8.30గంటల సమయంలో శుక్లా,ఇతర బీజేపీ నేతలతో కలిసి బయటకొచ్చారు. సమీపంలోని ఓ టీ స్టాల్ వద్ద అంతా కలిసి టీ తాగుతుండగా.. అకస్మాత్తుగా ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి శుక్లాపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ శుక్లా అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆయన ఛాతి,నుదుటి భాగాల్లో బుల్లెట్లు దిగాయి. హుటిహుటిన ఆయన్ను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. దుండగులు ముఖాలకు మాస్కులు ధరించి వచ్చినట్లు బీజేపీ కార్యకర్తలు చెప్తున్నారు.
మూల్యం తప్పదన్న ఎంపీ...
ఎంపీ అర్జున్ సింగ్ ఈ హత్య తృణమూల్ కాంగ్రెస్ పనే అని ఆరోపించారు. 'రాత్రి 7.30గం. వరకూ శుక్లా నాతోనే ఉన్నారు. టిటాగర్ పోలీస్ స్టేషన్కు సమీపంలోనే ఆయనపై 12 రౌండ్ల కాల్పులు జరిగాయి. వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించినప్పటికీ... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. తను నా ఆప్త మిత్రుడు... పోలీసుల ఎదుటే చంపబడ్డాడు..' అని అర్జున్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్లా తనకు చిన్న తమ్ముడి లాంటి వాడని... ఎప్పుడూ తనతోనే ఉన్నాడని చెప్పారు. బెంగాల్ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన శుక్లాను రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారని చెప్పారు. అధికార తృణమూల్ కాంగ్రెస్,పోలీసులు దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.శుక్లాపై కాల్పుల తర్వాత బీజేపీ మద్దతుదారులు బరాక్పూర్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు.
టీఎంసీపై ఆరోపణలు...
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా ఈ ఘటనపై ట్విట్టర్లో స్పందించారు. 'పార్టీ విధేయుడు,ఎంపీ అర్జున్ సింగ్కు సన్నిహితుడైన శుక్లా టిటానగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో హత్యకు గురయ్యారు. శుక్లా హత్యకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోలీసులను నియమించిందని ఎంపీ అర్జున్ సింగ్ మొదటినుంచి చెప్తూనే ఉన్నారు... దీనిపై సీబీఐ విచారణ జరగాలి... ఇందులో పోలీసుల పాత్ర తేలాలి...' అని పేర్కొన్నారు. అధికార పార్టీనే నేరస్తులకు ఆశ్రయం కల్పించి హత్యలకు ప్రేరేపిస్తోందని బీజేపీ సీనియర్ నేత అరవింద్ మీనన్ ఆరోపించారు.
Recommended Video
తోసిపుచ్చిన అధికార పార్టీ...
మరోవైపు టీఎంసీ నేతలు బీజేపీ ఆరోపణలను తోసిపుచ్చారు. బీజేపీలో అంతర్గత కుమ్ములాటలే ఈ హత్యకు దారితీశాయని... అది అందరికీ తెలుసునని చెప్పారు. టీఎంసీపై బురదజల్లేందుకే బీజేపీ ఈ ఆరోపణలు చేస్తోందన్నారు. కాగా,2019లో బీజేపీలో చేరేంతవరకు శుక్లా టీఎంసీలోనే ఉన్నారు. అర్జున్ సింగ్ బీజేపీలో చేరడంతో ఆయన కూడా అదే పార్టీలోకి వెళ్లారు. 2018లోనూ ఆయనపై దాడి జరిగింది. గతంలో ఆయన టిటాగర్ వ్యాగన్ ఫ్యాక్టరీ సూపర్వైజర్గా పనిచేశారు.