శుక్రవారం ప్రార్థనలకు పోటీగా హనుమాన్ చాలీసా .. మంగళవారం రోడ్లు క్లోజ్ .. ఎక్కడో తెలుసా ..?
కోల్ కతా : బెంగాల్లో టీఎంసీ వర్సెస్ బీజేపీ ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరుగుతున్న ఘర్షణలు తమ ఉనికిని చాటుకునేందుకు ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని స్పష్టమైంది. బెంగాల్ ఇలాకాలో బీజేపీ డామినేట్ చేయడాన్ని దీదీ సహించలేకపోతున్నారు. దీంతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఆ పార్టీకి ధీటుగా ప్రతిస్పందిస్తున్నారు.
బీజేపీ కూడా ..
బెంగాల్లో శుక్రవారం ముస్లింలు ప్రార్థనల కోసం రోడ్లు మూసివేస్తున్నారు. ఆ మసీదులు ఉండే రోడ్లు, కూడళ్లలో రహదారులు క్లోజ్ చేయడంతో స్థానికులు ఇబ్బందిపడుతున్నారు. దీంతో దీనికి ధీటుగా భారతీయ జనతా యువ మోర్చా నిర్ణయం తీసుకుంది. ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయాలు ఉన్న కూడళ్లలో హనుమాను చాలీసా పాఠించాలని .. ఇందుకోసం రహదారులు మూసివేస్తామని ప్రకటించింది. ముందుగా చెప్పినట్టుగా నిన్న పాటించి .. తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది.
జై హనుమాన్ ...
హౌరా పరిధిలోని బాలీకల్లో మంగళవారం బీజేవైఎం రహదారులను మూసివేసింది. హనుమాన్ నినాదాలతో హోరెత్తించింది. గ్రాండ్ ట్రంక్, ఇతర ప్రధాన రహదారుల్లో శుక్రవారం ప్రార్థనల కోసం రహదారులను మూసివేయడాన్ని తప్పుపట్టారు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఓపీ సింగ్. దీంతో ఆయా మార్గాల్లో వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. కొందరు రోగులు ఆస్పత్రికి వెళ్తూ చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయని గుర్తుచేశారు. మరికొందరు నిర్దేశిత సమయంలో కార్యాలయానికి చేరుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను కూడా సర్కార్ పట్టించుకోకపోవడంతో .. తాము మంగళవారం హనుమాన్ చాలీసా పఠించేందుకు రహదారులు మూసివేస్తున్నామని తేల్చిచెప్పారు.
ఆధిపత్య పోరు
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత బెంగాల్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయాయి. టీఎంసీ, బీజేపీ ఆధిపత్య పోరులు కార్యకర్తలు సమిధలవుతున్నారు. సోమవారం బంక్రా గ్రామంలో టీఎంసీ కార్యకర్తలు రెచ్చిపోయారని బీజేపీ ఆరోపించింది. అక్కడ కొందరు బీజేపీలో చేరడాన్ని టీఎంసీ జీర్ణించుకోలేకపోతుందని కమళ దళ నేతలు చెప్తున్నారు. దీంతోనే బీజేపీ కార్యకర్తలపై భౌతికదాడులకు దిగి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు భట్పరలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు చనిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లిన బీజేపీ నేతల ముందు కూడా ఘర్షణ జరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.