75 శాతం అబ్సెంట్: జేఈఈ నిర్వహణపై దీదీ నిప్పులు, మోడీపై గరం గరం, ఇతర రాష్ట్రాల్లో కూడా..
ప్రధాని నరేంద్ర మోడీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. జేఈఈ పరీక్షపై మొండి వైఖరితో ముందుకెళ్లారని మండిపడ్డారు. దీంతో 75 శాతానికి పైగా విద్యార్థులు పరీక్ష రాయలేదని చెప్పారు. దీనికి కారణం నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే అని ఆమె దుయ్యబట్టారు. జేఈఈ పరీక్ష నిర్వహణ కోసం తమ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. కరోనా వైరస్ వల్ల అభ్యర్థులెవరూ పరీక్ష రాయడానికి ముందుకు రాలేదన్నారు.
రాష్ట్రంలో 4,652 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. కానీ కేవలం 1,167 మంది మాత్రమే పరీక్ష రాశారని తెలిపారు. పరీక్షకు వచ్చిన విద్యార్థులు కూడా భయపడ్డారని తెలిపారు. విద్యార్థులు రాసే పరీక్ష కంటే ఇది మరింత కఠిన పరీక్షా సమయం అని కరోనా వైరస్ గురించి మమతా బెనర్జీ గుర్తుచేశారు.
Recommended Video
ఈ సమయంలో జేఈఈ పరీక్ష నిర్వహించి ఉండాల్సింది కాదని మమతా అభిప్రాయపడ్డారు. ఒక్క బెంగాల్ కాదు అన్ని రాష్ట్రాల్లో 50 శాతానికి మించి విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదన్నారు. కానీ తమ రాష్ట్రంలో మాత్రం ఆ సంఖ్య 75 శాతంగా ఉందని చెప్పారు. కరోనా మహమ్మారి ఇంత విజృంభిస్తోన్న సమయంలో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఏంటీ అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఇప్పుడే కాదు జేఈఈ పరీక్ష వాయిదా వేయాలని ఇదివరకే కేంద్ర ప్రభుత్వానికి మమతా బెనర్జీ విజ్ణప్తి చేశారు. కానీ కేంద్రం మాత్రం వినిపించుకోక.. పరీక్షను నిర్వహిస్తోందని మండిపడ్డారు.