దాదాకు గుండెపోటు: దీదీ విలవిల -సౌరవ్ గంగూలీ ఆరోగ్య పరిస్థితిపై బెంగాల్ సీఎం మమత ఆందోళన
భారత క్రికెట్ దిగ్గజం, క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐకి ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గుండెపోటుకు గురై, ఆస్పత్రిలో చేరారు. ఈ వార్త ఆయన అభిమానుల్లో ఆందోళన రేకెత్తించింది. గంగూలీని ఎంతగానో ఇష్టపడే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం విలవిలలాడిపోయారు. గంగూలీ ఆరోగ్య పరిస్థితిపై టీఎంసీ అధినేత్రి శనివారం కీలక ప్రకటన చేశారు..
గంగూలీకి గుండెపోటు..
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. శనివారం ఉదయం కోల్ కతా సిటీలోని తన ఇంట్లోని జిమ్లో వ్యాయామం చేస్తుండగా చాతీలో నొప్పి రావడంతో ఆయన విలవిల్లాడిపోయారు. దీంతో సౌరవ్ను హుటాహుటిన ఉడ్ల్యాండ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. సౌరవ్కు గుండెపోటుగా వైద్యులు నిర్ధారించారు. అంతేకాదు..
యాంజియో ప్లాస్టీ ఆపరేషన్..
కోల్ కతాలోని వుడ్ ల్యాండ్ ఆస్పత్రిలో చేరిన సౌరవ్ గంగూలీకి డాక్టర్ సరోజ్ మోండల్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం చికిత్స అందిస్తోంది. శనివారం సాయంత్రమే సౌరవ్కు యాంజియో ప్లాస్టీ చేయనున్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గంగూలీకి గుండెపోటు వచ్చిందన్న వార్త క్రీడా, రాజకీయ రంగాల్లో కలకలం రేపింది. స్పోర్ట్స్ జర్నలిస్టు బొరియా మజుందార్ గంగూలీ అస్వస్థతకు సంబంధించి ట్విటర్లో వివరాలు వెల్లడించారు. ఉదయం నుంచే ఆయన నలతగా ఉన్నారని తెలిపారు. యాంజియో ప్లాస్టీ అనంతరం సౌరవ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్చ్ అయ్యే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఇక..
సౌరవ్ ఆరోగ్యంపై మమత ట్వీట్..
మాజీ క్రికెటర్, బీసీసీఐ సారధి సౌరవ్ గంగూలీ త్వరగా కోలుకోవాలని రాజకీయ, క్రీడా ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు. గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం గంగూలీ అనారోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘గంగూలీకి గుండెపోటు వచ్చిందన్న వార్త విని చాలా బాధపడ్డాను. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ సమయంలో గంగూలీ కుటుంబానికి బలం చేకూరాలని కోరుతున్నాను''అంటూ సీఎం మమత తన అధికారక ట్విటర్ లో రాసుకొచ్చారు.