హిట్అండ్రన్: జనంపై కాల్పులు, టిఎంసి నేత అరెస్ట్
కోల్కతా: పశ్చిమబెంగాల్లో అధికార తృణమాల్ కాంగ్రెస్(టీఎంసీ) నాయకుడు పవిత్రా రాయ్ను హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం మాల్దాలో పవిత్రా రాయ్ ప్రయాణిస్తున్న కారు.. సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది.
ఈ ఘటనలో అషీమ్ మండల్(18) అనే యువకుడు అక్కడిక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడ్డ మరో వ్యక్తి (20) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
అయితే ప్రమాదం జరిగిన తర్వాత కారును ఆపకుండా పవిత్రా రాయ్ డ్రైవర్ వేగంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు చుట్టుముట్టి కారును ఆపారు. పవిత్రా రాయ్ కారు దిగకుండా వీరంగం సృష్టించాడు. కారు లోపల నుంచే జనంపై కాల్పులు జరిపాడు.
ఆ సమయంలో కారులో పవిత్రా రాయ్ తో పాటు ఐదుగురు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆదివారం రాత్రి టీఎంసీ నేత పవిత్రా రాయ్ను అరెస్ట్ చేశారు. కాగా, ఆయనతో కలసి కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు పరారీలో ఉన్నారు.