మరిన్ని నేతాజీ ఫైళ్లు బయటపెట్టిన మమతా బెనర్జీ
కోల్కతా: స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్య ఘటనకు సంబంధించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సోమవారం నాడు మరిన్ని ఫైళ్లను బహిర్గతం చేసింది. ఈ వివరాలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు.
నేతాజీకి సంబంధించి 1938 - 1947 మధ్య జరిగిన బెంగాల్ రాష్ట్ర కేబినెట్ సమావేశాల్లోని అంశాలను బహిర్గతం చేశారు. నేతాజీకి సంబంధించిన ఫైళ్లను కేంద్రం కూడా బహిర్గతం చేయాలని మమతా బెనర్జీ కోరారు.
నేతాజీ దస్త్రాలను బహిర్గతం చేయండి
కేంద్రం వద్ద ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్కు సంబంధించిన పత్రాలను బహిర్గతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నేతాజీ కుమార్తె కోరారు. ఆయన అదృశ్యం వెనక ఉన్న రహస్యాలను బహిర్గతం చేయాలన్నారు.
పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం విడుదల చేసిన పత్రాలను ఇంకా అందుకోలేదని 72 ఏళ్ల అనితా బోస్ ఆమె ఆదివారం నాడు తెలిపారు. అందువల్ల పత్రాల్లో ఏముందో తెలియదన్నారు. ముఖ్యంగా నేతాజీ మరణం గురించి ఏ సమాచారం ఉందో తెలియదన్నారు.
గత 30 ఏళ్లుగా రహస్యంగా ఉంచిన పత్రాలను బహిర్గతం చేయాలని విద్యావేత్తగా, నేతాజీ కుమార్తెగా కోరుతున్నామన్నారు. నేతాజీకి సంబంధించిన పత్రాలను బహిర్గతం చేయాలని బ్రిటన్, రష్యా, జపాన్ ప్రభుత్వాలను తాను కోరలేనన్నారు. భారత ప్రభుత్వమే ఆ పని చేయాలన్నారు. నేతాజీవిగా భావించే జపాన్లోని రెన్కోజి ఆలయంలోని బూడిద అవశేషాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని కోరారు.
శాస్త్రి దస్త్రాలను వెల్లడి చేయాలి
మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి మరణానికి సంబంధించిన దస్త్రాలను బహిర్గతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాస్తానని కాంగ్రెస్ నేత, శాస్త్రి తనయుడు అనిల్ శాస్త్రి పేర్కొన్నారు. వచ్చే వారం ప్రధాని విదేశీ పర్యటన నుంచి తిరిగివచ్చాక లేఖ రాయనున్నట్లు చెప్పారు.